హుజూర్నగర్, జూలై 18: అంగన్వాడీ కేంద్రాల ద్వారా పంపిణీ చేసే పౌష్టికాహారం గతంలో కొంతమంది బ్లాక్ మార్కెట్కు తరలించేవారు. క్లస్టర్ల నుంచి సరుకులు అంగన్వాడీలకు చేరడం లేదనే ఫిర్యాదులు చాలా వచ్చేవి. కేంద్రాల నిర్వాహకులు సైతం లబ్ధిదారులకు సరుకులు సక్రమంగా పంపిణీ చేసేవారు కాదు. కోడిగుడ్లు, బియ్యం, మురుకులు, నూనె, పాలు, బాలామృతం ప్యాకెట్లు, ఇలా అన్నీ మార్కెట్లో దర్శనమిచ్చేవి. దీంతో ఐసీడీఎస్ సేవలపై తీవ్ర విమర్శలు వచ్చేవి. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ అక్రమాలకు చెక్ పెడుతూ లబ్ధిదారులకు ఆధార్ గుర్తింపును తప్పనిసరి చేసింది. బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయడంతో పాటు సరికొత్తగా యాప్లను అందుబాటులోకి తీసుకు వచ్చింది. జిల్లా, డివిజన్ స్థాయి గోదాముల్లో సరుకులను నిల్వ ఉంచే కార్యక్రమాలకు స్వస్తి చెప్పి, నేరుగా అంగన్వాడీ కేంద్రాలకు చేర్చేలా చర్యలు తీసుకుంటున్నది.
సమగ్ర మాతా శిశు అభివృద్ధి పథకం కింద సూర్యాపేట జిల్లాలో 1209అంగన్వాడీ కేంద్రాలున్నాయి. వీటిలో 1126 ప్రధాన, 83 మినీ అంగన్వాడీ కేంద్రాలున్నాయి. వాటిలో ఏడు నెలల నుంచి ఆరేండ్ల లోపు చిన్నారులు దాదాపు 65,151 మంది ఉన్నారు. బాలింతలకు 150 గ్రాములు, 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలకు 75 గ్రాముల బియ్యం అందిస్తున్నారు. దీంతో పాటు 30గ్రాముల పప్పు, 16గ్రాముల నూనె, ప్రతి రోజూ ఒక గుడ్డు, 200మిల్లీ లీటర్ల పాలు, పిల్లలకు ప్రత్యేకంగా 20 గ్రాముల మురుకులను ఇస్తున్నారు. పిల్లలకు ప్రతి నెలా 2.5 కిలోల బాలామృతం ప్యాకెట్ అందిస్తున్నారు.
అక్రమాలకు చెక్…
అంగన్వాడీ కేంద్రాల్లో పారదర్శకత కోసం ప్రభుత్వం సాంకేతికతను అమలు చేస్తున్నది. అందులో భాగంగానే బయోమెట్రిక్, యాప్ల ద్వారా నిత్య పర్యవేక్షణ చేపడుతున్నది. అలాగే సరుకులను నేరుగా అంగన్వాడీ సెంటర్లకు పంపిణీ జరిగేలా చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే పప్పులు, నూనెలు, మురుకులు, బాలామృతం, పాలు వంటి సరుకులు హైదరాబాద్ నుంచే నేరుగా కేంద్రాలకు సరఫరా చేస్తోంది. గతంలో లీటర్ నూనె ప్యాకెట్లు వచ్చేవి. నూనె పంపిణీలో ఇబ్బందులు తొలగించేందుకు ప్యాకెట్లను సైతం మార్చింది. పంపిణీకి సౌలభ్యంగా ఉండేలా 800, 250ఎంఎల్ ప్యాకెట్లను సరఫరా చేస్తోంది. కార్గో సేవలను వినియోగించుకుంటూ నూనె ప్యాకెట్లను సరఫరా చేస్తోంది. కోడిగుడ్లు సక్రమంగా పంపిణీ అయ్యేలా ఎగ్యాప్ను రూపొందించింది. దీంట్లో భాగంగా గుడ్ల స్టాక్ వివరాలు ఎప్పటికప్పుడు యాప్లో నమోదు అవుతాయి. స్టాక్ను తీసుకునే అంగన్వాడీ టీచర్కు ముందుగానే ఓటీపీ వస్తుంది. దాని ఆధారంగానే గుడ్లు తీసుకోవాలి. ఆధార్ లేని వారికి స్థానికత ఆధారంగా సరుకులు అందిస్తున్నారు.