నల్లగొండ, జూలై 20: పట్టణ, స్థానిక సంస్థల పరిధిలో 2014 తర్వాత అనుమతించిన లే అవుట్లపై ఆడిట్ నిర్వహించాలని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్ కలెక్టర్లకు సూచించారు. మంగళవారం పురపాలక శాఖ సంచాలకుడు సత్యనారాయణతో కలిసి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. ఆడిట్ నిర్వహించి ఆయా లే అవుట్లలో పది శాతం స్పేస్ స్థానిక సంస్థల పేరుమీద రిజిస్ట్రేషన్ చేయాలని సూచించారు. ఒక వేళ స్థలం తక్కువగా ఉంటే మార్కెట్ రేటు ప్రకారం పెనాల్టీ వసూలు చేయాలని సూచించారు. లే అవుట్ అనుమతుల కోసం ఏర్పాటు చేసిన జిల్లాస్థాయి టాస్క్ ఫోర్సు కమిటీకి సహకరించాలని కోరారు. వీడియో కాన్ఫరెన్స్లో నల్లగొండ జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ, కమిషనర్లు పాల్గొన్నారు.
లే అవుట్లపై ప్రత్యేక నిఘా
సూర్యాపేట నుంచి పాల్గొన్న కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని ఐదు మున్సిపాల్టీల పరిధిలో చేపడుతున్న అభివృద్ధి పనులను వివరించారు. లేఅవుట్లపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. హరితహారంలో నాటిన మొక్కల సంరక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు వివరించారు. కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్ హేమంత్ కేశవ్పాటిల్, మున్సిపల్ కమిషనర్లు రామానుజుల రెడ్డి, గోపయ్య, శ్రీనివాస్, నరేశ్రెడ్డి, నాగేంద్రబాబు, శ్రీదేవి పాల్గొన్నారు.