నల్లగొండ ప్రతినిధి, జూలై19(నమస్తే తెలంగాణ) : కృష్ణానదిలో కొనసాగుతున్న వరద ప్రవాహంతో నాగార్జునసాగర్ ఆయకట్టు రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. గతేడాది మాదిరిగానే ఈ సారి కూడా సాగర్కు ముందస్తుగానే వరద రావచ్చని భావిస్తున్నారు. జూరాల ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో ఆ నీరంతా శ్రీశైలం రిజర్వాయర్లోకి వచ్చి చేరుతున్నది. దీంతో ప్రాజెక్టు నీటిమట్టం క్రమంగా పెరుగుతున్నది. కృష్ణానదికి ప్రస్తుతం ప్రారంభమైన వరద అక్టోబర్ వరకు కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ఈ ఏడాది నాగార్జునసాగర్లోనూ నీటిమట్టం ఆశాజనకంగానే ఉంది. గతేడాదితో పోలిస్తే క 3 టీఎంసీల నీరు అదనంగా అందుబాటులో ఉంది. సాగర్ రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు(312 టీఎంసీలు) కాగా సోమవారం సాయంత్రానికి 531.40 అడుగులు (170.89 టీఎంసీలు) ఉన్నది. గతేడాది జూలై 18వ తేదీన 529.80 అడుగుల (167.75 టీఎంసీలు) నీరు మాత్రమే ఉంది.
శ్రీశైలానికి భారీగా వరద
ఎగువన ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్ రిజర్వాయర్లు నిండడంతో ఆ ప్రాజెక్టుల నుంచి విడుదలైన నీరు జూరాలను ముంచెత్తుతోంది. దీంతో జూరాల ప్రాజెక్టు పూర్తిగా నిండడంతో శనివారం సాయంత్రం గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ఆ నీరంతా శ్రీశైలం రిజర్వాయర్కు వచ్చి చేరుతున్నది. జూరాల నుంచి శ్రీశైలానికి సోమవారం సాయంత్రం వరకు 1,50,098 క్యూసెక్కుల నీరు ఇన్ఫ్లోగా వచ్చి చేరుతోంది. శ్రీశైలం రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 828.70 అడుగుల(48.16 టీఎంసీలు) నీరు నిల్వ ఉంది. జూరాల ప్రాజెక్టు నుంచి వచ్చే వరద మరో మూడు నెలల వరకు కొనసాగే అవకాశం ఉండగా.. శ్రీశైలం ప్రాజెక్టు ఈ ఏడాది కూడా పూర్తిస్థాయిలో నిండనున్నది. 36 గంటల్లోనే ప్రాజెక్టులో 12 అడుగుల మేర నీటిమట్టం పెరిగింది. ఇప్పటికే శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ద్వారా కరెంట్ ఉత్పత్తి చేస్తుండడంతో 21,189 క్యూసెక్కుల నీరు సాగర్ ప్రాజెక్టుకు వచ్చి చేరుతున్నది.
ఆయకట్టులో ఆశలు
కృష్ణానదికి ఎగువ ప్రాంతాల నుంచి వరద వస్తుండడంతో నాగార్జునసాగర్ ఆయకట్టు రైతులు సంతోషంగా ఉన్నారు. ఈ ఏడాది కూడా ముందస్తుగానే సాగునీరు విడుదలయ్యే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సాగర్ ఎడమ కాల్వ ఆయకట్టు కింద రెండు రాష్ర్టాల్లో కలిపి దాదాపు 11లక్షల ఎకరాలకు సాగునీరు విడుదల చేస్తుంటారు. గతేడాది రెండు పంటలకు పూర్తి స్థాయిలో నీటిని విడుదల చేశారు. ఈ వేసవిలోనూ తాగునీటి అవసరాలతో పాటు చెరువులను నింపేందుకు కాల్వల్లో నిరంతరం నీటి విడదల కొనసాగింది. అయినా సాగర్లో ప్రస్తుతం 531.40 అడుగుల మేర నీరు నిల్వ ఉన్నది. కనీస నీటిమట్టం 510 అడుగులు కాగా దాదాపు 21.40 అడుగుల నీరు అదనంగానే ఉన్నది. అందుకే త్వరలోనే నారుమళ్ల కోసం నీటిని విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత శ్రీశైలం నుంచి వచ్చే వరదనీటిని బట్టి ఆయకట్టుకు పూర్తి స్థాయి నీటివిడుదల జరుగనుంది. గతేడాది జూలైలోనే నాగార్జునసాగర్ ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో మొదలుకాగా ఆగస్టు 7వ తేదీ నుంచి ఎడమకాల్వకు నీటిని విడుదల చేశారు. రెండు పంటలకు ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిలో సరిపోయేంత నీటిని అందించారు. ఈ ఏడాది కూడా అదే పరిస్థితి కనిపిస్తుండగా.. రైతులు సంతోషంగా సాగుకు సమాయత్తమవుతున్నారు.