రామగిరి, జూలై 14 : మొక్కల పెంపకంతోనే పర్యావరణ సమతుల్యత సాధ్యమవుతుందని జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎంవీ రమేశ్ అన్నారు. నల్లగొండ కోర్టు ఆవరణలోని భవనాల సముదాయంలో బుధవారం మొక్కలు నాటి మాట్లాడారు. కాలుష్య నివారణతో పాటు ప్రశాంతమైన వాతావరణం కావాలంటే ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని సూచించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి సతీమణి ఎంవీ రత్నారమేశ్, న్యా యమూర్తులు ఎన్వీ నాథ్రెడ్డి, నాగరాజు, వెంకటేశ్వర్రావు, జి.వేణు, మాధవీలత, కీర్తిచంద్రికారెడ్డి, అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.
నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించాలి
నీలగిరి : ప్రభుత్వ దవాఖాన పార్కులో నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించాలని దవాఖాన సూపరింటెండెంట్ డా. జైసింగ్ రాథోడ్ అన్నారు. పార్కు అవరణలోని మొక్కలను బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా సిబ్బందికి పలు సూచనలు చేశారు. పార్కు ఆహ్లాదకరంగా ఉండాలని, రోగుల సహాయకులు సేద తీరేందుకు వీలుగా తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. ఆయన వెంట ఆర్ఎంఓ ప్రశాంత్, డాక్టర్ లచ్చు నాయక్, కాంట్రాక్టర్లు మాండ్ర వెంకన్న, ఏర్పుల కామేశ్వర్ ఉన్నారు.
అవెన్యూ ప్లాంటేషన్ పరిశీలన
నల్లగొండ రూరల్ : పల్లెప్రగతిలో భాగంగా నాటిన ప్రతి మొక్కనూ బతికించుకునేలా చర్యలు తీసుకోవాలని ఎంపీడీఓ వై.శ్రీనివాస్రెడ్డి కోరారు. మండలంలోని అన్నెపర్తి గ్రామంలో అవెన్యూ ప్లాంటేషన్లో భాగంగా రోడ్డుకు ఇరువైపులా నాటిన మొక్కలను బుధవారం ఆయన పరిశీలించి మాట్లాడారు.నాటిన మొక్కలు చనిపోతే వాటి స్థానంలో కొత్త మొక్కలు నాటాలని సూచించారు. ఆయన వెంట ఎంపీఓ జూలకంటి మాధవరెడ్డి, ఏపీఓ గోపాల్రెడ్డి, ఉపాధి హామీ సిబ్బంది పాల్గొన్నారు.