నేరేడుచర్ల, జూలై 14 :కరోనా విలయతాండవం చేసినా కొద్దిమందిలో ఏమాత్రం జాగ్రత్త కనిపించడం లేదు. మొదటి వేవ్, రెండో వేవ్లో మన చుట్టు పక్కల కుటుంబాలను అనాథలను చేసినా మాకేంటి అని పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. గతేడాది ప్రారంభమైన ఈ కరోనా మొదటి వేవ్లో తీవ్ర ఇబ్బందులు పెట్టగా రెండో దశలో అత్యధిక శాతం ప్రజల ప్రాణాలను బలిగొంది. లాక్డౌన్ పెట్టినా, రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు హెచ్చరికలు చేస్తున్నా ప్రజలు మాత్రం పెడచెవిన పెడుతున్నారు.
లాక్డౌన్ సడలింపుతో…
కొవిడ్ కేసులు తగ్గుముఖం పట్టడంతో రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ సడలింపులు ఇవ్వగా ప్రజలు ఇష్టానుసారంగా రోడ్లమీద తిరుగుతున్నారు. కొవిడ్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. గుంపులుగా తిరుగుతున్నారు. శానిటైజర్ వినియోగం, మాస్కుల వాడకం బాగా తగ్గించారు. అధికారులు చూసీచూడనట్లుగా ఉండడంతో కొవిడ్ కేసులు చాపకింద నీరులా రోజురోజుకూ పెరుగుతున్నాయి.
డెల్టా ప్లస్తో మరింత ఆందోళన
కొవిడ్ రెండో వేవ్ తర్వాత మూడో వేవ్ వస్తుందని ప్రచారం జరుగుతున్నది. మరోవైపు డెల్టా ప్లస్ వేరియంట్ అమెరికా సహా మరికొన్ని పాశ్చాత్య దేశాల్లో విజృంభిస్తున్నది. ఈ వేరియంట్తో మన దేశంలో కూడా కొన్ని కేసులు నమోదైన వార్తలు ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నది. దీనితో పాటు జికా వైరస్ కూడా వ్యాప్తి చెందే అవకాశం ఉన్నదని ప్రచారం జరుగుతున్నది.
ప్రజలు నిర్లక్ష్యంగా ఉండొద్దు
ప్రభుత్వం లాక్డౌన్ ఎత్తి వేసిందని ప్రజలు నిర్లక్ష్యంగా ఉండకూడదు. కరోనా మహమ్మారి పట్ల ప్రభుత్వం సూచించిన నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి. అత్యవసర పరిస్థితిలో తప్ప బయటకు రాకుండా ఇంట్లోనే ఉండాలి. పస్తుతం వర్షాలు, ముసురు కారణంగా సీజనల్ వ్యాధులు అధికంగా వచ్చే అవకాశం ఉంది. ప్రజలంతా అప్రమత్తంగా ఉంటూ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి.
మాస్క్ ధరించకుంటే జరిమానా తప్పదు
ప్రభుత్వం లాక్డౌన్ సడలించిన తర్వాత జిల్లాలో చాలా మంది మాస్కులు ధరించకుండా గుంపులుగా తిరుగుతున్నారని, అలాంటి వారికి జరిమానాలు విధించడంతోపాటు కేసులు నమోదు చేస్తామని ఎస్పీ రంగనాథ్ బుధవారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. ప్రజలంతా బాధ్యతాయుతంగా వ్యవహరించి కరోనా నివారణకు సహకరించాలని, లేకపోతే పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలిపారు. శుభ, అశుభ కార్యాలను పరిమిత సంఖ్యలో చేసుకోవాలని సూచించారు. కరోనా పూర్తిగా తొలగిపోలేదని, థర్డ్వేవ్ ప్రమాదం పొంచి ఉందని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు.