నీలగిరి, జూలై 23 : రాష్ట్ర ప్రభుత్వం పోలీస్శాఖకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నదని, సీఎం కేసీఆర్ ఎన్నో సంస్కరణలు చేపట్టి మెరుగైన వసతులు కల్పిస్తున్నారని అడిషనల్ డీజీపీ బి.శివధర్రెడ్డి అన్నారు. అన్నెపర్తిలోని 12వ బెటాలియన్లో శిక్షణ పొందిన 346మంది కానిస్టేబుళ్ల దీక్షా పరేడ్ కార్యక్రమానికి శుక్రవారం ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా పోలీసుల గౌరవ వందనం స్వీకరించి శాంతి పావురాలను ఎగరవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణలో పోలీస్ వ్యవస్థ చాలా కీలకమైందని అన్నారు. ప్రజలతో మమేకమై వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. ఎస్పీ ఏవీ రంగనాథ్ మాట్లాడుతూ ప్రజల కాంక్షలకు తగ్గట్టుగా మంచిపేరు తీసుకురావాలన్నారు. బెటాలియన్ కమాండెంట్ ఎన్వీ సాంబయ్య మాట్లాడుతూ 12వ బెటాలియన్లో శిక్షణ పొందిన పోలీస్ సిబ్బంది దేశవ్యాప్తంగా పలు సందర్భాల్లో విశేష సేవలు అందించి ప్రశంసలు అందుకున్నారని తెలిపారు. 2018 సంవత్సరంలో నిర్వహించిన హరితహరంలో బెటాలియన్కు హరితమిత్ర అవార్డు దక్కిందని గుర్తు చేశారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ చోడగిరి సతీశ్, అసిస్టెంట్ కమాండెంట్ పార్థసారథిరెడ్డి, నర్సింగ్ వెంకన్న, కృష్ణారావు, శ్రీరాముల నాగేశ్వర్రావు పాల్గొన్నారు.