తిప్పర్తి/ శాలిగౌరారం, జూలై 25 : తిప్పర్తి, శాలిగౌరారం మండలాల్లో వానకాలం వరినాట్లు జోరుగా సాగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అండగా అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుండడంతో సంతోషంగా సాగు చేస్తున్నారు. మిషన్ కాకతీయ ద్వారా చెరువుల్లో పూడిక తీయడం వల్ల భూగర్భ జలాలు పెరిగి బోర్లు బాగా పోస్తున్నాయి. దీనికితోడు నిరంతర విద్యుత్ సరఫరా, రైతుబంధు డబ్బులు అందడంతోపాటు వాతావరణం సైతం సహకరిస్తుండడంతో రైతులకు కష్టాలు లేకుండాపోయాయి. దీంతో సాగు విస్తీర్ణం ప్రతి ఏటా పెరుగుతూనే ఉంది. గతేడాది వానకాలంలో తిప్పర్తి మండలంలో 20వేల ఎకరాల్లో వరి, 7500 ఎకరాల్లో పత్తి సాగు చేశారు. ఈ వానకాలంలో 23నుంచి 25వేల ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారు.
సమయానికి నాట్లు అవుతున్నాయి
గతంలో సరిగా వర్షాలు కురువక నాట్లు ఆలస్యమయ్యేవి. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. సకాలంలో వర్షాలు కురుస్తున్నందున బోర్లు బాగా పోస్తున్నాయి. దీనికితోడు ప్రభుత్వ సహకారం బాగుంది. అనుకున్న సమయానికే నాట్లు అవుతున్నాయి.
సాగు పెరిగింది
విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో రైతులు సాగు పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ వానకాలంలో సాగు విస్తీర్ణం బాగా పెరిగింది. ఇతర పంటలు కంది, వేరుశనగ కూడా పెరిగింది. రైతులకు కావాల్సిన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉన్నాయి.