రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమంతో గ్రామాలు, పట్టణాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారమయ్యాయి. మొన్నటి వరకు చెత్తా చెదారం, పిచ్చిమొక్కలతో అధ్వాన్నంగా ఉన్న వీధులు నేడు మెరిసి పోతున్నాయి. మురుగు కాల్వలను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తుండడంతో నీరు నిల్వ ఉండకుండా సాఫీగా వెళ్తున్నది. దీంతో పాటు నిరంతరం బ్లీచింగ్ పౌడర్ చల్లుతుండడంతో దోమలు, ఈగల బెడద తొలగిందని ప్రజలు చెబుతున్నారు.
183 గ్రామ పంచాయతీల్లో..
నాగార్జునసాగర్ నియోజకవర్గంలో రెండు మున్సిపాలిటీలు, ఏడు మండలాల్లోని 183 గ్రామ పంచాయతీల్లో పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించారు. నియోజకవర్గంలోని అనుముల మండలంలో 21, త్రిపురారంలో 32, నిడమనూరులో 29, పెద్దవూర 26, గుర్రంపోడు 37, తిరుమలగిరి (సాగర్)34, మాడ్గులపల్లి మండలంలో 4 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా అధికారులు, ప్రజాప్రతినిధులు ఉద్యమ స్ఫూర్తితో పని చేశారు. ప్రజలను భాగస్వాములను చేస్తూ డ్రైనేజీలు శుభ్రం చేయడం, చెత్త, పెంట దిబ్బల తొలగింపు, రోడ్లపై ఉన్న గుంతల పూడ్చివేత, శిథిలావస్థకు చేరిన భవనాల తొలగింపు వంటి పనులు చేపట్టారు. దీంతో గ్రామాలు పరిశుభ్రంగా కనిపిస్తున్నాయి.
ఊరంతా పచ్చదనమే..
పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా హరితహారం కూడా నిర్వహించారు. ప్రతి ఇంటికీ 6 మొక్కలు పంపిణీ చేయడంతో పాటు వీధులు, రోడ్ల వెంట, ప్రభుత్వ స్థలాల్లో విరివిగా మొక్కలు నాటారు. దీంతో గ్రామాలు, పట్టణాలు పచ్చదనంతో నిండిపోయాయి. ఏ వీధిలో చూసినా పచ్చటి మొక్కలే దర్శనమిస్తున్నాయి. 7వ విడుత హరితహారంలో భాగంగా నాగార్జునసాగర్ నియోజకవర్గంలో 21.50 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్ణయించగా ఇప్పటి వరకు 16 లక్షల మొక్కలు నాటారు.
ఉద్యమ స్ఫూర్తితో పని చేశారు
పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమంలో ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఉద్యమ స్ఫూర్తితో పని చేశారు. గ్రామాల్లో పారిశుధ్యం పూర్తిస్థాయిలో మెరుగు పడింది. దీంతో సీజనల్ వ్యాధులకు అడ్డుకట్ట పడింది. అభివృద్ధి పనులు కూడా కొనసాగుతున్నాయి.