నాంపల్లి, జూలై 27 :పల్లె ప్రగతి పనులతో గ్రామాలు కళకళలాడుతున్నాయి. పారిశుధ్యం, పచ్చదనానికి పెద్దపీట వేస్తూ విశాలమైన ప్రకృతి వనాలు, సీసీ రోడ్లు దర్శనమిస్తున్నాయి. వైకుంఠ ధామాలు, సెగ్రిగేషన్ షెడ్లు, డంపింగ్ యార్డులు.. ఇలా సకల వసతులను సమకూర్చుకుంటున్నాయి. ఏండ్ల తరబడి అపరిష్కతంగా ఉన్న సమస్యలన్నింటికీ పరిష్కారం లభిస్తుండడంతో పాలకవర్గాలతో పాటు ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే, నాంపల్లి మండలం వడ్డేపల్లిలో పాలకవర్గం నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణ లోపంతో పల్లెప్రగతి పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి.నిధులున్నా నిర్మాణాలు చేపట్టకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
వడ్డేపల్లిలో పల్లె ప్రకృతి వనం ఆనవాళ్లు కోల్పోయింది. పచ్చని చెట్లతో కళకళలాడాల్సిన వనం బోసిబోయింది. అధికారులు దామెరకు వెళ్లే డొంక దారిలో స్థలాన్ని కేటాయించి మొక్కలు నాటించగా.. వాటి సంరక్షణ కొరవడింది. దాంతో మొక్కల ఎదుగుదల నిలిచిపోగా ప్రకృతి వనం మొత్తం గడ్డి పెరిగి, పిచ్చి మొక్కలతో కనిపిస్తున్నది. కనీసం కంచె కూడా ఏర్పాటు చేయకపోవడంతో ఉన్న కొన్ని మొక్కలను కూడా మూగజీవాలు మేసే అవకాశం ఉన్నది.
అసంపూర్తిగా డంపింగ్ యార్డు..
పారిశుధ్యానికి పెద్ద పీట వేస్తున్న ప్రభుత్వం ఇంటింటికీ రెండు చెత్త బుట్టలను పంపిణీ చేస్తున్నది. తడి, పొడి చెత్తను సేకరించి డంపింగ్ యార్డుకు తరలించేలా లక్షల రూపాయల వ్యయంతో ట్రాక్టర్ కొనుగోలుకు అవకాశం కల్పించింది. అయితే, వడ్డేపల్లిలో డంపింగ్ యార్డు నిర్మాణం పూర్తికాలేదు. ఇంటింటికీ చెత్త సేకరణ నిలిచిపోయింది. వీధులు అపరిశుభ్రంగా మారిపోయాయి. సెగ్రిగేషన్ షెడ్డుకు రేకులు బిగించి వదిలేశారు.
అర్ధాంతరంగా నిలిచిన వైకుంఠ ధామం
గ్రామానికి కూత వేటు దూరంలో, మెయిన్ రోడ్డుకు సమీపంలో చేపట్టిన వైకుంఠ ధామం నిర్మాణం అర్ధాంతరంగా నిలిచిపోయింది. అన్ని వసతులతో నిర్మాణం పూర్తి చేయాల్సి ఉండగా.. అసంపూర్తిగా దర్శనమిస్తున్నది. స్నానాల గదులు, పిల్లర్ల పనులు ఎక్కడికక్కడే నిలిచిపోగా.. ‘పూర్తయ్యేదెన్నడో..!’ అని గ్రామస్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటాం…
వడ్డేపల్లి గ్రామంలో పల్లె ప్రగతి పనులు త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటాం. ప్రకృతి వనంలో మొక్కల సంరక్షణతో పాటు వైకుంఠ ధామం నిర్మాణానికి ఆదేశాలు జారీ చేస్తాం. అయినప్పటికీ స్పందించని పక్షంలో సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తాం.