సూర్యాపేట, జూలై 27 (నమస్తే తెలంగాణ) : టీఆర్ఎస్ ప్రభుత్వం గత ఏడేండ్లుగా దళితుల అభ్యున్నతికి అనేక పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నది. ప్రధానంగా ఎకనామికల్ సపోర్ట్ స్కీం (ఈఎస్ఎస్) కింద ఎస్సీ నిరుద్యోగ యువతకు భారీ సబ్సిడీతో ప్రభుత్వం రుణాలు అందిస్తున్నది. కూరగాయలు, కారం మిల్లు, గాజుల స్టోర్, చికెన్ షాప్, కిరాణా దుకాణం, టైలరింగ్, డీటీపీ సెంటర్, జిరాక్స్, ఆటోమొబైల్స్ వంటి చిన్నతరహా వ్యాపారాలతోపాటు కార్లు, ఆటోలు, ట్రాక్టర్లకు వ్యక్తిగత రుణాలు ఇస్తున్నది. వీటిల్లో లక్ష రూపాయల వరకు 80శాతం సబ్సిడీ ఇస్తుండగా.. రూ.2లక్షల వరకు 70శాతం సబ్సిడీ ఉంది. ఇలా దళితులకు అనేక రకాలుగా సాయం చేస్తున్న ప్రభుత్వం.. పాత స్కీంలతోపాటు తాజాగా ఎస్సీ నియోజకవర్గాలకు మినీ డెయిరీలు ఇవ్వాలని నిర్ణయించింది.
ఉమ్మడి జిల్లాలో రెండు నియోజకవర్గాలకు
ఎస్సీ నియోజకవర్గాలకు మంజూరు చేసిన మినీ డెయిరీ ఫామ్లు ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలోని తుంగతుర్తి, నకిరేకల్ నియోజకవర్గాలకు వర్తించనున్నాయి. తుంగతుర్తి నియోజకవర్గానికి 175, నకిరేకల్కు 150 యూనిట్లు మంజూరయ్యాయి. ఒక్కో యూనిట్ ధర రూ.2లక్షలు కాగా 1.40లక్షలు (70శాతం) సబ్సిడీ అందనుంది. మరో రూ.60వేలు బ్యాంకు రుణంగా ఇస్తారు. యూనిట్కు వన్ ప్లస్ వన్గా ఒక బర్రె, ఒక దున్నను అందివ్వనున్నారు.
ఐదెకరాల్లోపు వారు అర్హులు
20 గుంటల నుంచి 5 ఎకరాల్లోపు ఉన్న సన్న, చిన్నకారు దళితులు ఈ పథకానికి అర్హులు. బర్రెలకు కావాల్సిన గడ్డి పెంచేందుకు కచ్చితంగా భూమి ఉన్నవారినే ఎంపిక చేస్తారు. లబ్ధిదారులకు ఇచ్చే బర్రెల దానా కోసం గడ్డి విత్తనాలు కూడా అందించనున్నారు. ఐదు సార్లు గడ్డి కోసేందుకు ఉపాధి హామీ కూలీ పని చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నారు.
విజయ డెయిరీకి అనుసంధానం
లబ్ధిదారులకు భారీ సబ్సిడీతో బర్రెల యూనిట్ అందివ్వడంతో పాటు పాల విక్రయం సులువుగా ఉండేలా విజయ డెయిరీకి అనుసంధానం చేయనున్నారు. దీంతో పాలకు మంచి ధర అందడంతోపాటు విజయ డెయిరీ వారు తరచూ బర్రెలకు హెల్త్ క్యాంపులు నిర్వహించి మందులు అందిస్తారని అధికారులు తెలిపారు.