సూర్యాపేట టౌన్, జూలై 11 : జనాభా స్థిరీకరణకు ప్రతిఒక్కరూ బాధ్యత తీసుకోవాలని అదనపు కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్ అన్నారు. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జనాభా పెరుగుదల వల్ల కలిగే అవసరాలు, అనర్థ్ధాలు, సామాజిక అసమానతలు, ఆర్థిక సమస్యలపై వివరించారు. ప్రతి 12 సంవత్సరాలకు ప్రపంచ జనాభాకు వంద కోట్ల జనాభా అదనంగా చేరుతుందన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో 1999 నుంచి 95 శాతం జనాభా పెరుగుదల ఉన్నదని, ఈ దేశాల్లో జనాభా పెరుగుదల రేటు చాలా తగ్గిపోయి నిలకడగా ఉన్నదని తెలిపారు. సగటు ఆయువు ప్రమాణం పెరుగడంతో వృద్ధుల జనాభా ఆయా దేశాలకు శాపంగా మారిందన్నారు. జిల్లాలో కుటుంబ సంక్షేమం కోసం పనిచేస్తున్న సిబ్బందిని అభినందించారు. ఉత్తమ సర్జన్ డాక్టర్ కె.మమత, ఉత్తమ స్టాఫ్ నర్స్ హైమావతి, ఉత్తమ సూపర్వైజర్ శిరోమణి, ఉత్తమ మహిళా ఆరోగ్య కార్యకర్త గోవిందమ్మ, ఉత్తమ ఆశ కార్యకర్త సుజాతను జ్ఞాపిక, ప్రశంసాపత్రాలతో సత్కరించారు.
డీఎంహెచ్ఓ డాక్టర్ కోటాచలం మాట్లాడుతూ జిల్లా జనాభా 11 లక్షలుగా అంచనా వేసినట్లు తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో వెయ్యి జనాభాకు జననాల రేటు 16.9, మరణాల రేటు 6.3గా ఉందన్నారు. ప్రతి సంవత్సరం వెయ్యి జనాభాకు అదనంగా 10 మంది జమ అవుతున్నారని తెలిపారు. జనాభా విస్ఫోటనం వల్ల ఆర్థిక, ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. జనాభా స్థిరీకరణకు ప్రతిఒక్కరూ బాధ్యత వహించాలన్నదే జనాభా దినోత్సవ ఉద్దేశం అని తెలిపారు. బాల్య వివాహాలు, పెళ్లి జరిగిన వెంటనే పిల్లలను కనడం, కాన్పుకు కాన్పుకు మధ్య ఎడం లేకపోవడం, మగ పిల్లల కోసం ఎదురు చూడటం వంటివి జనాభా పెరుగుదలకు ప్రధాన కారణాలని తెలిపారు. వీటిపై అవగాహన పెంచుకుని ప్రజలంతా కుటుంబ నియంత్రణ పద్ధతులు పాటించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా ఉప వైద్యాధికారి డాక్టర్ హర్షవర్ధన్, డీఐఓ వెంకటరమణ, పాపిరెడ్డి, కళ్యాణ్చక్రవర్తి, శ్రీనివాసరాజు, డెమో అంజయ్యగౌడ్, భాస్కర్రాజు, భూతరాజు సైదులు, ఆరోగ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.