చివ్వెంల, జూలై 23 : చట్టాలపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని ఉమ్మడి నల్లగొండ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి వేణు సూచించారు. భారత్ కా అమృత్ మహోత్సవ్ జాతీయ కార్యక్రమంలో భాగంగా మండలంలోని మున్యానాయక్ తండాలో నల్లగొండ మండల న్యాయ సేవా సమితి, సూర్యాపేట జిల్లా పరిపాలనా యంత్రాంగం ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. రాజ్యాంగం అందరికీ సమాన హక్కులు కల్పించిందని, హక్కులతోపాటు బాధ్యతలను విధిగా నెరవేర్చాలని అన్నారు. మారుమూల గ్రామాల్లోని ప్రజలు హక్కుల గురించి తెలువకుండా ఉన్నారని, అందుకే న్నాయ విజ్ఞాన సదస్సులు నిర్వహిస్తున్నామని చెప్పారు. భ్రూణ హత్యలు చేయరాదని, బాలలను కార్మికులుగా మార్చి శ్రమ దోపిడీకి పాల్పడొద్దని అన్నారు. గర్భస్థ శిశువు పిండ నిర్ధారణకు పూనుకుంటే, మానవ అక్రమ రవాణా చేస్తే కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు. వయోవృద్ధుల సంక్షేమ చట్టం, గిరిజనుల హక్కులు, ఆస్తి హక్కు, జాతీయ ఆహార భద్రత చట్టంపై న్యాయం గురించి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎంపీపీ ధరావత్ కుమారి బాబూనాయక్, ఆర్డీఓ రాజేంద్రకుమార్, డీఎస్పీ మోహన్కుమార్, తాసీల్దార్ రంగారావు, ఎంపీడీఓ జమలారెడ్డి, ఎస్ఐ విష్ణుమూర్తి, సర్పంచ్ బికారు, ఎంపీటీసీ ధరావత్ సుశీల, ఆశ కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.