నల్లగొండ, జూలై 19 : మాంసం ప్రియులకు ఎప్పుడూ చౌకగా లభించే బాయిలర్ చికెన్ ధరలు కొండెక్కినయ్. సామాన్యులకు అందనంతగా అమాంతం పెరుగడంతో మాంసం తినేందుకు వెనుకాడుతున్నారు. 15 రోజుల కింద రూ.200లోపు ఉన్న కిలో చికెన్ ధర.. తాజాగా రూ.240కి చేరింది. ఇక స్కిన్లెస్ రూ.270 అమ్ముతున్న వ్యాపారులు.. బోన్లెస్ కిలో రూ.580 దాకా విక్రయిస్తున్నారు. దీంతో మాంసం ప్రియులు బెంబేలెత్తిపోతున్నారు.కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ప్రభుత్వం లాక్డౌన్ విధించడంతో చికెన్ మార్కెట్ తగ్గింది. దీంతోపాటు ఈ నెల 7నుంచి వచ్చే నెల ఐదో తేదీ వరకు ఆషాఢ మాసం వల్ల శుభకార్యాలు ఉండకపోవడంతో ఉత్పత్తిదారులు కోళ్ల పెంపకంపై పెద్దగా దృష్టి సారించలేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు కోళ్ల ఉత్పత్తి తగ్గి డిమాండ్ పెరుగడంతో ధరలు అమాంతం పెరిగాయని చికెన్ వ్యాపారులు పేర్కొంటున్నారు. కరోనా సెకండ్ వేవ్ సమయంలో కోడి గుడ్ల వినియోగం బాగా ఉండడం, వాటి ఉత్పత్తి తగ్గడంతో ఒక్కో గుడ్డు ధర రిటైల్లో ఏడు రూపాయలకు చేరింది.
సాధారణంగా కోడి పిల్లలు 40 నుంచి 45 రోజుల్లో కోతకు వస్తాయి. కరోనా సెకండ్ వేవ్ తీవ్రతతో ఈ ఏడాది మే 11 నుంచి జూన్ 10 వరకు రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ విధించింది. ఈ క్రమంలో నష్టాలు వస్తాయని రైతులు కోళ్ల ఉత్పత్తిని నిలిపివేయడంతో ధరలు ఊహించనంతగా పెరిగి సామాన్యుడికి అందకుండా పోయింది. ఆషాఢ మాసంలో శుభకార్యాలు ఉండవని ఇప్పటికీ ఉత్పత్తి పెద్దగా పెరుగలేదని వ్యాపారులు అంటున్నారు. ఈ క్రమంలో మరో నెల వరకు చికెన్ ధరలు పెద్దగా తగ్గకపోవచ్చని వారు పడుతున్నారు.
గుడ్ల వినియోగం పెరిగినందునే..
కరోనా నేపథ్యంలో ఇమ్యూనిటీ పవర్ కోసం ప్రజలు కోడి గుడ్ల వినియోగం పెంచారు. మే, జూన్ నెలల్లో గుడ్ల వినియోగం విరివిగా పెరిగింది. సాధరణంగా గుడ్డు ధర హోల్సేల్ ఒక్కటి రూ.4.50, రిటైల్ రూ.ఐదు చొప్పున మార్కెట్లో ఉంటుంది. కరోనాతో వినియోగం పెరుగడం, ఉత్పత్తి తగ్గడంతో ధరలు విపరీతంగా పెరిగాయి. ప్రస్తుతం ఒక్క గుడ్డు హోల్సేల్గా రూ.5.50 రిటైల్లో ఏడు రూపాయలకు విక్రయిస్తున్నారు. వీటి ధరలు సైతం అదుపులోకి రావడానికి మరో నెల రోజులు పట్టే అవకాశం ఉన్నట్లు వ్యాపారులు పేర్కొంటున్నారు.
నెల నుంచి సగం మేర తగ్గిన సప్లయ్..
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పేరొందిన చికెన్ ఉత్పత్తిదారులు ఎనిమిది మంది ఉన్నారు. చిన్నా చితక మినహాయిస్తే ఈ ఎనిమిది మందే జిల్లా ప్రజలకు కావాల్సిన చికెన్ను అందిస్తారు. సాధారణంగా ప్రతి రోజూ ఉమ్మడి జిల్లాలో సుమారు 25వేల నుంచి 30వేల కోళ్లు అవసరం అవుతాయని ఉత్పత్తిదారుల అంచనా. ఒక్క రోజు 500 నుంచి 600 క్వింటాళ్ల వరకు అవసరం ఉంటుంది. కిలో రెండు వందల చొప్పున లెక్కేస్తే జిల్లాలో మాంసం ప్రియులు రోజూ రూ.కోటి నుంచి రూ.1.20 కోట్లు ఖర్చు చేస్తున్నారు. తాజాగా ఉత్పత్తి తగ్గడంతో పది వేల నుంచి 15 వేల కోళ్లు మాత్రమే సరఫరా చేయగలుగుతున్నారు. దీంతో ధరలు పెరుగడంతో సామాన్యులు చికెన్ వాడకం తగ్గించేశారు. ఆషాఢం పూర్తయ్యాక కిలో రూ.150కి పడిపోయే అవకాశం ఉంది.
డిమాండ్కు తగ్గ సప్లయ్ లేదు
మాంసంలో దేనికి డిమాండ్ ఉన్నా.. లేకపోయినా బాయిలర్ చికెన్కు మాత్రం బాగా ఉంటుంది. డిమాండ్కు తగ్గట్లు సప్లయ్ ఉంటే కిలో రూ.150 దాకా ఉంటుంది. ఒక్కోసారి వంద రూపాయలకే అమ్మాల్సి వస్తుంది. నెల రోజులుగా మార్కెట్లోకి పెద్దగా కోళ్లు రావడం లేదు. లాక్డౌన్ ఎంతకాలం ఉంటుందోనని ఉత్పత్తిదారులు కోళ్ల ఉత్పిత్తి బంద్ చేసిండ్రు. దాంతోనే ఇప్పుడు కిలో రూ.240 అయ్యింది. పైగా ఇప్పుడు ఆషాఢం. పెద్దగా అమ్మకాలు కూడా ఉండవు. దాంతో డిమాండ్ మేరకు మార్కెట్కు కోళ్లు ఇప్పట్లో వచ్చే అవకాశం ఉండకపోవచ్చు