కనగల్ మండలంలో 70శాతం ఆయకట్టులో రైతులు వరి సాగు చేస్తున్నారు. ఏండ్ల తరబడి ఒకే పంటను పండిస్తుండడంతో పెద్దగా ఆదాయం ఉండడం లేదు. కానీ, అతి తక్కువ భూమి కలిగిన రైతులు కూరగాయలు సాగు చేస్తూ మంచి ఫలితాలు సాధిస్తున్నారు. ఎకరంలోపు భూమిలో ఆకు కూరలు, టమాట, వంకాయ లాంటి కూరగాయలు సాగు చేసి రోజూ మార్కెట్కు తరలిస్తున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ లాభం పొందుతున్నారు. మండలంలోని శాబ్దుల్లాపురం గ్రామానికి చెందిన రైతు (న్యాయవాది) కేసాని వెంకట్రెడ్డి ఏండ్ల తరబడి వరి సాగు చేశాడు. ఆదాయం లేకపోగా పలుమార్లు నష్టాలు రావడంతో ఇటీవల కూరగాయల సాగు చేపట్టాడు. రోజూ 30 బాక్సుల టమాటా, క్వింటాల్కు పైగా మిర్చిని జిల్లా కేంద్రంలోని మార్కెట్కు తరలిస్తూ లాభాలు పొందుతున్నాడు. కూరగాయల సాగులో పెద్దగా అనుభవం లేకున్నా తొలిసారి ప్రయత్నంలోనే మంచి దిగుబడులు సాధించినట్లు వెంకట్రెడ్డి తెలిపారు. సంబంధిత శాఖల అధికారుల సూచనల మేరకు డ్రిప్ పద్ధతిలో ఎకరం విస్తీర్ణంలో టమాటా, మరో ఎకరంలో మిర్చి, 2 ఎకరాల్లో బొప్పాయి సాగు చేస్తున్నాడు.
వరి కంటే కూరగాయలు బెటర్..
వరి సాగు కంటే కూరగాయల సాగే చాలా బాగుంది. 4ఎకరాల్లో టమాటా, మిర్చి, బొప్పాయి పంటలు సాగు చేశాను. ప్రస్తుతానికి పసుపు పంట వేసేందుకు బోదెలను ఏర్పాటు చేయిస్తున్నాను. కూరగాయల సాగులో ఆశించిన దానికంటే మంచి దిగుబడులు వచ్చాయి. టమాట 25టన్నులు, మిర్చి 5టన్నుల దిగుబడి వచ్చింది. బొప్పాయి మరో మూడు నెలల్లో క్రాపు తీసే అవకాశం ఉంది. రైతులు వరికి బదులు ప్రత్యామ్నాయ పంటల సాగుతో ఆర్థికంగా నిలదొక్కుకోవచ్చు.
తక్కువ సమయంలో ఎక్కువ దిగుబడి…
కూరగాయల సాగు వల్ల తక్కువ సమయంలో ఎక్కువ ఆదాయం ఉంటుంది. జిల్లాలో గతంలో కంటే ఈ సారి నర్సరీల్లో మేలు రకమైన కూరగాయల నారు, విత్తనాలు దొరుకుతున్నాయి. దీంతో పాటు పలు బ్రాండెడ్ కంపెనీల విత్తనాలు సైతం అందుబాటులో ఉన్నాయి.