కల్వకుర్తి/ చారకొండ, నవంబర్ 28: అధికారుల క్షేత్రస్థాయి పర్యవేక్షణ కరువవడంతో ఉపాధ్యాయులు డిప్యూటేషన్లో గందరగోళం నెలకొంది. నిబంధనల ప్రకారం వి ద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్న పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులను విద్యార్థుల సంఖ్య ఎక్కువ ఉన్న పాఠశాలలకు, లేదా విషయాంశాలు బోధించే టీచర్లు లేని పాఠశాలకు డిప్యూటేషన్పై పంపించాల్సి ఉంటుంది. విద్యాశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించకుండా తీసుకున్న డిప్యూటేషన్ నిర్ణయాలు గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి. పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఎక్కువవడం, వారి సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులు లేకపోవడంతో విద్యాబోధనలో అంతరాయం కలుగుతున్నది.
జూపల్లి ప్రాథమిక పాఠశాలలో..
చారకొండ మండలంలోని జూపల్లి ప్రాథమిక పాఠశాలలో ఆరుగురు ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. అందులో ఒక ఉపాధ్యాయుడు కరోనాతో మృతి చెందగా ప్రస్తుతం ఐదుగురు ఉన్నారు. పాఠశాలలో 5 తరగతుల కు 186మంది విద్యార్థులు ఉన్నారు. ఒక టో తరగతిలో 60 మందికి పైగా విద్యార్థు లు చదువుతున్నారు. మాధవి అనే ఉపాధ్యాయురాలు ఇంట్లో ప్రమాదవశాత్తు జారిపడి కాలుకు గాయమవడంతో రెండు నెలలపాటు మెడికల్ లీవ్లో ఉండనున్నారు. ఉపాధ్యాయురాలు పద్మను ఇదే కాంపౌండ్లో ఉన్న జెడ్పీహైస్కూల్లో జీవశాస్త్రం బోధించేందుకు డిప్యూటేషన్ ఇచ్చారు. కాగా హెచ్ఎంతో కలిపి మొత్తం ముగ్గురు ఉపాధ్యాయులు 186మందికి బోధించాల్సిన పరిస్థితి ఏర్పడింది. హెచ్ఎంకు పరిపాలనా పనులు, కాంప్లెక్స్ మీటింగ్, దినవారీ పనులు ఉంటాయి. మిగిలిన ఇద్దరు టీచర్లు ఐదు తరగతుల్లోని 186మందికి ఎలా బోధిస్తారని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. జూపల్లిలో రెండు ప్రైవేటు పాఠశాలలుండగా ఈ ఏడాది మాత్రం తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పా ఠశాలకే పంపించారు. సెప్టెంబర్ నుంచి ఇప్పటివరకు ప్రభుత్వ పా ఠశాల్లో 96మంది విద్యార్థులు చేరారు. మొత్తం 186మంది విద్యార్థులు ఉండగా పాఠశాలలో ఉపాధ్యాయులు కొరత ఏర్పడడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నిబంధనల ప్రకారం..
ప్రభుత్వ నిబంధనల ప్రకారం 35 మంది విద్యార్థులు ఒక ఉపాధ్యాయుడు ఉండాలి. సెప్టెంబర్లో విద్యార్థులు, ఉపాధ్యాయుల సంఖ్య ఆధారంగా త యారు చేసిన జాబితా ప్రకారం డిప్యూటేషన్ లిస్ట్ తయారు చేయడంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అధికారులు జాబితా తయారు చే సిన తరువాత ప్రాథమిక, ఉన్నత పాఠశాలలో నవంబర్ నాటికి విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. వీటిపై దృష్టి సారించకుండా ఉపాధ్యాయులను డిప్యూటేషన్పై పం పించడంతో ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి.
చాలా పాఠశాలల్లో అదే పరిస్థితి..
ఒక్క జూపల్లి పాఠశాలలోనే కాదు.. చాలా పాఠశాలల్లో ఈ పరిస్థితి నెలకొన్నది. మర్రిపల్లి, వెల్దండలోని ప్రాథమిక పాఠశాలల్లోనూ ఇదే పరిస్థితి.. విద్యార్థుల సంఖ్యను సరిచూసుకోకుండా విద్యాధికారులు ఉపాధ్యాయుల డిప్యూటేషన్ లిస్టు తయారు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్న పాఠశాలల్లో విషయాంశాలు బోధించే ఉపాధ్యాయులు ఉన్నా.. వారికి డిప్యూటేషన్ ఇవ్వకపోవడంపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి.
డీఈవో దృష్టికి తీసుకెళ్లాం
జూపల్లి ప్రాథమిక పాఠశాల సమస్యను డీఈవో దృష్టికి తీసుకె ళ్లాం. సెప్టెంబర్లో జూపల్లి ప్రాథమిక పాఠశాలలో 86మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారు. జీవశాస్త్రం బోధించే ఉపాధ్యాయురాలు ఉన్న విషయాన్ని క్రోడీకరిస్తూ డీఈవోకు డిప్యూటేషన్ లిస్ట్ పంపించారు. సెప్టెంబర్ తరువాత పాఠశాలలో దాదాపు 100 మంది విద్యార్థులు అడ్మిషన్ తీసుకున్నారు. విద్యార్థులకు ఇబ్బంది కలుగకుండా చర్యలు తీసుకుంటా.