నాగర్కర్నూల్: విలేజీ లెవల్ మల్టీ డిసిప్లీనరీ టీములతో ప్రతి ఇంటిని సర్వే చేసి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వంద శాతం పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. మంగళవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు, జిల్లా వైద్యాధికారులు, జిల్లా పరిషత్ సీఈవోలు, జిల్లా పంచాయతీ అధికారులతో జిల్లాల వారీగా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని సమీక్షించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆశ, అంగన్వాడీ, పంచాయతీ కార్యదర్శి, వీఆర్ఏ, రేషన్ షాపు డీలర్లతో కూడిన విలేజ్ లెవెల్ మల్టీ డిసిప్లీనరీ టీమ్లు స్పెషలాఫీసర్ల పర్యవేక్షణలో ప్రతి ఇల్లు సర్వే చేసి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పరిశీలించాలన్నారు. సర్వేలో ఎవరు మొదటి డోస్ తీసుకున్నారు. ఎవరు రెండో డోస్ తీసుకున్నారు. ఎవరు అసలే వ్యాక్సిన్ తీసుకోలేదు అనే వివరాలను సేకరించాలని, వ్యాక్సిన్ కార్యక్రమాన్ని 100 శాతం నిర్వహించాలని సూచించారు.
రాష్ట్రంలో 5 కోట్ల 60 లక్షల మందికి లక్ష్యానికి గాను 3 కోట్ల 5 లక్షల మందికి వ్యాక్సిన్ వేశామని, 100 శాతం వ్యాక్సినేషన్ వేయడమే లక్ష్యంగా పనిచేయాలని తెలిపారు. జిల్లా కలెక్టర్లు క్షేత్ర స్థాయిలో రోజువారి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పరిశీలించాలని సూచించారు.
వీడియో కాన్ఫరెన్స్లో రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేటీవ్ ప్రిన్సిపాల్ సెక్రటరీ అవ్వింద్కుమార్, రాష్ట్ర పంచాయతీరాజ్ సెక్రటరీ సందీప్కుమార్ సుల్తానియా, రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ సెక్రటరీ రిజ్వీ, రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేటీవ్ డైరెక్టర్ డాక్టర్ సత్యనారాయణ, రాష్ట్ర పంచాయతీ శాఖ కమిషనర్ డాక్టర్ శరత్, జిల్ల నుండి అదనపు కలెక్టర్ మనుచౌదరి, పీడీడీఆర్డీ నర్సింగ్రావు, జెడ్పీ సీఈవో ఉషా, వైద్యాధికారులు పాల్గొన్నారు.