మక్తల్రూరల్,మే 29: దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారిని నిర్మూలించేందుకు చేపట్టిన వ్యాక్సినేషన్ కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించింది. ముఖ్యంగా ప్రజలతో నిత్యం సంబంధాలు కలిగి వివిధ రంగాల్లో సేవలు అందిస్తున్న వర్గాలను ఫ్రంట్లైన్ వారియర్స్గా గుర్తించింది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఫ్రంట్లైన్ సూపర్ స్ప్రెడర్లకు కొవిడ్ -19 టీకాలు వేయాలని వైద్య శాఖ అధికారులకు ఆదేశాలు జారీచేసింది. ముఖ్యంగా జర్నలిస్టులు, రేషన్డీలర్లు, గ్యాస్ ఏజెన్సీ డెలివరీ బాయ్స్, తదితర వర్గాల వారు టీకాలు వేసుకోవడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు.
శనివారం మక్తల్ మండలంలో చౌకధర దుకాణాల డీలర్లకు వ్యాక్సినేషన్ ప్రక్రియ రెండోరోజు కొనసాగింది. పట్టణంలోని ప్రభుత్వ దవాఖానాలో, కర్ని పీహెచ్సీ సెంటర్లో వైద్య సిబ్బంది కొవిడ్ టీకాలు వేశారు. ఈమేరకు మండలంలోని కర్ని, పారేవుల, గోలపల్లి, దాసరిదొడ్డి, గుడిగండ్ల, చందాపూర్, మక్తల్, సంగంబండ, చిట్యాల తదితర గ్రామాల చౌకధర దుకాణాల డీలర్లు కొవిడ్ మొదటి డోస్ టీకాలు వేయించుకున్నారు. రెండోరోజు 86 మంది సూపర్ స్ప్రెడర్లకు టీకాలు వేసినట్లు హెల్త్ సూపర్వైజర్ లక్ష్మీనారాయణ తెలిపారు. రేషన్ డీలర్లకు ఆదివారం కూడా వ్యాక్సినేషన్ నిర్వహిస్తామన్నారు. ఇంకా ఎవరైన వేసుకోనివారు తప్పనిసరిగా వేసుకోవాలని, అలాగే రేషన్ షాపుల్లో పనిచేసే సహాయకులకు వేయించాలని, లేకపోతే నిత్యావసర సరకుల పంపిణీ సమయంలో టీకాలు వేసుకోని వారిని అనుమతించబోమని రేషన్డీలర్ల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుడిగండ్ల చంద్రశేఖర్, మక్తల్ మండల కమిటీ అధ్యక్షుడు అమరేందర్రెడ్డి, ఉపాధ్యక్షుడు అయూబుద్దీన్ నిజామీ , కార్యదర్శి వెంకటేశ్ తెలిపారు.
అర్హులందరూ
వ్యాక్సిన్ వేయించుకోవాలి
నారాయణపేట టౌన్, మే 29: జిల్లాలో ఆదివారం కూడా సూపర్ స్ప్రెడర్లకు ప్రత్యేక వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ హరిచందన ప్రకటనలో తెలిపారు. ఆర్టీసీ కార్మికులకుకూడా నేడు మొదటి డోసు వ్యాక్సిన్ ఇస్తామన్నారు. ఆర్టీసీ కార్మికులకు పేట జిల్లా దవాఖానలోనే వ్యాక్సినేషన్ కేంద్రం ఏర్పాటు చేశామని, ఆధార్ కార్డు, గుర్తింపు కార్డును తమ వెంట తీసుకువెళ్లాలన్నారు. ఇంతవరకు వ్యాక్సిన్ తీసుకోని మీడియా రిపోర్టర్లు, దుకాణాల యజమానులు, ఎల్పీజీ గ్యాస్ చేరవేసే వారు ఎవరైనా మిగిలి ఉన్నట్లయితే వారు కూడా వ్యాక్సిన్ వేసుకోవాలని కోరారు.
కొవిడ్నుంచి రక్షణకు టీకా వేసుకోవాలి
ఊట్కూర్, మే 29 : కరోనా కట్టడికి అందరూ టీకా వేసుకోవాలని పీహెచ్సీ వైద్యుడు శ్రీకాంత్రెడ్డి అన్నారు. శనివారం ఊట్కూర్, పులిమామిడి పీహెచ్సీలో రేషన్ డీలర్లు, పాత్రికేయులు, పెట్రోల్ బంకుల్లో పని చేసే సూపర్ స్ప్రెడర్లు 30 మందికి టీకా వేసినట్లు అధికారులు తెలిపారు. ప్రజల మధ్యన ఉంటూ సేవలందిస్తున్న వారందరూ టీకా తప్పనిసరిగా వేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డాక్టర్ నరేశ్చంద్ర, ఎంపీహెచ్ఈవో హేమలాల్, సూపర్వైజర్ మణికాల, ఆరోగ్యమిత్ర సురేశ్, ఏఎన్ఎంలు శైలజ, చిట్టెమ్మ పాల్గొన్నారు.