పెద్దకొత్తపల్లి, ఏప్రిల్ 28: నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల రైతుల పంట పొలాలకు సాగునీరు అందించడమే లక్ష్యంగా అభివృద్ధి చేస్తున్నామని ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి అన్నారు. బుధవారం బాచారం హైలెవల్ కెనాల్ పనులకు టీఆర్ఎస్ జిల్లా నాయకులు జగదీశ్వర్రావుతో కలిసి ఎమ్మెల్యే భూమిపూజ చేశారు. రూ.46 లక్షలతో ఈ కెనాల్ పనులు నిర్వహించనున్నట్లు తెలిపారు. సర్వే పనులను స్వ యంగా దగ్గరుండి ప్రజాప్రతినిధులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బాచారం హైలెల్ కెనాల్ పనులు పూర్తయితే మండలంలోని పెద్దకొత్తపల్లి, యాపట్ల, జగన్నాథపురం, మారెడుమాన్దిన్నె, చంద్రబండతండా తదితర గ్రామాల్లోని రైతులకు చెందిన 10వేల ఎకరాలకు సాగునీరు అందనున్నదని చెప్పారు. పంట పొలాలకు శాశ్వత సాగునీటి సమస్య పరిష్కారమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వచ్చే నెలలో పూర్తిస్థాయి డీపీఆర్ తయారు చేసి టెండర్లు పిలిచి పనులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అడిగిన వెంటనే బాచారం కెనాల్ హైలెవల్ కెనాల్ కోసం పరిపాలనా అనుమతులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్కు కొల్లాపూర్ ప్రాంత రైతాంగం తరఫున ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ఇరిగేషన్ ఎస్ఈ విజయభాస్కర్రెడ్డి, ఈఈలు శ్రీనివాస్రెడ్డి, సంజీవ్రావు, డీఈఈ అమర్సింగ్, ఏఈ బాల్రాం, టీఆర్ఎస్ నాయకులు గణేశ్రావు, చంద్రయ్య, మోహన్రెడ్డి, రవినాయక్ తదితరులు పాల్గొన్నారు.