సకాలంలో రైతులకు ఎరువులు, విత్తనాలు పంపిణీ
ఉనికి కోసం దొంగ దీక్షలకు దిగుతున్న ప్రతిపక్షాలు
ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి
దేవరకద్ర రూరల్, మే 28 : రైతుల కష్టాలు తెలిసిన వ్యక్తి సీఎం కేసీఆర్.. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అహర్నిశలు కృషి చేస్తున్నారని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. దేవరకద్రలో శుక్రవారం ఏ ర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. వానకాలం, యాసంగి పంటల సాగుకు రైతులకు సకాలంలో ఎరువులు, విత్తనాలు అందించేందుకు ప్రభు త్వం చర్యలు తీసుకుంటున్నదని తెలిపారు. అలాగే రైతుబంధు పథకంతో ఎకరాకూ రూ.10వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తున్నట్లు తెలిపారు. దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా రైతుబంధు పథకం లేదన్నారు. లిఫ్ట్ల ద్వారా నీటిని తోడి ప్రతి చెరువునూ నింపి రైతులకు సాగునీటి వసతి కల్పిస్తున్నామని తెలిపారు. రైతులకు అన్ని సదుపాయాలు ఉ న్నందునే పంటలను పుష్కలంగా పండిస్తున్నారన్నారు. ఈ యాసంగిలో 70వేల ఎకరాలు సాగైందని చెప్పారు. పం డించిన పంటను మద్దతు ధరకు ప్రభుత్వం కొనుగోలు చేసి రైతులు నష్టపోకుండా చూస్తుందన్నారు. కొనుగోలు చేసిన ధాన్యంతో గోదాములు నిండిపోయాయని, దీంతో కొనుగోలు చేసిన ధాన్యం తరలించేందుకు కొంత ఆలస్యమవుతుందని తెలిపారు. దీన్ని సాకుగా చేసుకుని ప్రతిపక్ష నాయకులు తమ ఉనికిని కాపాడుకునేందుకు దొంగదీక్షలు చేస్తూ నాటకాలు ఆడుతున్నారన్నారు. రైతుల సంక్షేమానికి కృషి చేస్తుంటే చూసి ఓర్వలేకనే ప్రభుత్వంపై బురదజల్లే ప్రయ త్నం చేస్తున్నారని దుయ్యబట్టారు.
తాగునీటి సమస్య ఏర్పడకుండా చూడాలి
గ్రామాల్లో తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి సర్పంచులకు సూచించారు. మండల సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్యే హాజరయ్యారు. మండల ప్రజా పరిషత్ అభివృద్ధి నిధుల నుంచి మంజూరైన రూ.22లక్షల 50వేల నిధులకు సంబంధించి ఆయా గ్రామాల ఎంపీటీసీలకు ప్రొసిడింగ్ కాపీలను ఎమ్మెల్యే అందజేశారు. అనంతరం మాట్లాడుతూ గ్రామాలకు మిషన్ భగీరథ నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడితే గతంలో ఉన్న బోర్లకు మరమ్మతులు చేయించి ప్రజలకు నీటి ఇబ్బందులు ఏర్పడకుండా చూడాలన్నారు. ఇందుకు సంబంధించిన బిల్లులు వెంటనే చేసుకునేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్తోపాటు మంత్రి శ్రీనివాస్గౌడ్ దృష్టికి తీసుకెళ్లగా, సానుకూలంగా స్పందించారని తెలిపారు. కరోనా వ్యాప్తి నియంత్రణకు ప్రతిఒక్కరూ లాక్డౌన్ నిబంధనలు పాటించాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ రమాదేవి, జెడ్పీటీసీ అన్నపూర్ణ, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
రైతుబీమా దేశానికే ఆదర్శం
భూత్పూర్, మే 28 : అన్నదాతల కుటుంబాలకు ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబీమా దేశానికే ఆదర్శమని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని పోతులమడుగు గ్రామానికి చెందిన కొత్త తెలుగు గోపాల్ కుటుంబానికి రైతుబీమా చెక్కు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలను రైతులకోసం ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్నారన్నారు. రైతుబీమా రైతుల కుటుంబాలకు భరోసానిస్తున్నదని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ కదిరె శేఖర్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ సత్తూర్ బస్వరాజ్గౌడ్, ఏవో మురళీధర్, సింగిల్విండో చైర్మన్ కదిరె అశోక్రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సత్తూర్ నారాయణగౌడ్, కోఆప్షన్ సభ్యుఉ అజీజ్, నాయకులు మనెమోని సత్యనారాయణ, మురళీధర్గౌడ్, సత్యనారాయణ, అశోక్ తదితరులు పాల్గొన్నారు.