ధాన్యం తరలింపునకు కార్గో బస్సులు విఫలమైన ప్రైవేట్ సంస్థలు
కష్టకాలంలో ధాన్యాన్ని తరలిస్తున్న ఆర్టీసీ
తడవకుండా తమవంతు బాధ్యత
మహబూబ్నగర్ మే 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): అసలే కరోనా.. ఇంటి నుంచి బయటకు వెళ్లే పరిస్థితి లేదు. కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతోంది. ఇలాంటి సమయంలో ధాన్యం విక్రయించేందుకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సొంత ఊరిలోనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతుకు కష్టం కలుగకుండా చూస్తోంది సర్కారు. భూగర్భజలాలు పెరగడంతోపాటు ప్రభుత్వం అందిస్తున్న పెట్టుబడి సాయం, 24గంటల నిరంతర విద్యుత్తో ఉమ్మడి జిల్లాలో యాసంగి సాగు విస్తీర్ణం పెరిగింది. యాసంగిలో ధాన్యం దిగుబడి భారీగా ఉండడంతో కొనుగోలు కేంద్రాలన్నీ నిండిపోతున్నాయి. ఉమ్మడి జిల్లాలో 5,77,522 ఎకరాల్లో వరి సాగు కాగా.. 10,03,847 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం నిర్ధేశించారు. 790 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. కొనుగోలు చేసిన ధాన్యాన్ని రవాణా చేయడంలో ప్రైవేట్ రవాణా ఏజెన్సీలు విఫలం కావడంతో ప్రభుత్వ యంత్రాంగం ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించింది. కల్లాలు, కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం తరలింపునకు ఆర్టీసీ కార్గో సేవలను వినియోగించుకోవాలని పౌరసరఫరాల శాఖ నిర్ణయించింది. ధాన్యం రవాణా కోసం ఆర్టీసీ కార్గో సేవలను వినియోగించుకుంటోంది. మహబూబ్నగర్ డిపో ఆధ్వర్యంలో 5 కార్గో బస్సులు, 5 డీజీటీ వాహనాలతో ధాన్యం తరలింపులో ఆర్టీసీ తనవంతు పాత్ర పోషిస్తున్నది.
ధాన్యపు కార్గోలు..
కొనుగోలు చేసిన ధాన్యాన్ని రైస్ మిల్లులకు రవాణా చేసేందుకు ఏర్పాటు చేసుకున్న ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీలు అవసరమైన మేర లారీలు పంపలేక పోయాయి. లాక్డౌన్ అమల్లో ఉండడంతో కూలీల కొరత వేధిస్తోంది. దీంతో మిల్లుల వద్ద రోజుల తరబడి వాహనాలు నిలిచిపోతున్నాయి. పరిస్థితిని గమనించిన యంత్రాంగం ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆర్టీసీ సేవలను వినియోగించుకునేందుకు నిర్ణయించింది. ఈ నెల 13న 10 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల 5 కార్గో వాహనాలతో ధాన్యం తరలింపు చేపట్టారు. రవాణా సమస్య ఎక్కువగా ఉన్న సీసీకుంట మండలానికి వీటిని కేటాయించారు. ఈ కార్గోల ద్వారా ధాన్యం వర్షానికి తడువకుండా మిల్లులకు తరలించారు. ఈ నెల 17న మరో 4 కార్గో వాహనాలు అందుబాటులోకి వచ్చాయి. ధాన్యం రవాణాలో ఏర్పడిన ఇబ్బందులను అధిగమించేందుకు కార్గో సేవలను ప్రత్యామ్నాయంగా వినియోగిస్తున్నారు. మహబూబ్నగర్ జిల్లాలో లక్షా 80వేల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా వేయగా, ఇప్పటికే 1.21లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చింది. మరో రెండు వారాల్లో ధాన్యం కొనుగోలు పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కార్గో వాహనాల వల్ల ధాన్యం తరలింపు మరింత సులభం అయ్యిందని అధికారులు తెలిపారు.
పది బస్సులు తరలిస్తున్నాయి
ప్రభుత్వ ఆదేశాల మేరకు మహబూబ్నగర్ రీజియన్ పరిధిలో (5 కార్గో, 5 డీజీటీ) 10 బస్సులను ధాన్యం తరలింపునకు వినియోగిస్తున్నాం. ఈ నెల 13న ధాన్యం తరలింపు ప్రారంభించాం. ఒక్కో కార్గో వాహనం ఇప్పటివరకు సుమారు 3నుంచి 4 ట్రిప్పుల మేర ధాన్యం తరలించింది. అన్ని వాహనాలు కలిపి సుమారు 30ట్రప్పుల మేర ధాన్యం తరలించాయి. ప్రతి ట్రిప్పు మీద ఆర్టీసీకి సుమారు రూ. 8వేల ఆదాయం వస్తుంది. అయితే ఒక్కో బస్సుకు నాలుగైదు రోజులకు ఓ ట్రిప్ వస్తోంది. ఇంకా ధాన్యం తరలింపు ప్రక్రియ కొనసాగుతున్నది.
అశోక్రాజ్, డిపో మేనేజర్, మహబూబ్నగర్
వర్షం పడినా తడిచిపోవు..
లారీలు, ట్రాక్టర్ల కొరత వల్ల ప్రభుత్వం ఆర్టీసీ కార్గో సేవలను వినియోగించుకోమని చెప్పింది. ప్రస్తుతం 10 బస్సులు ధాన్యం తరలిస్తున్నాయి. కార్గో బస్సులు అన్ని వైపులా మూసి ఉంచడం వల్ల ధాన్యం తరలింపు ప్రక్రియలో వర్షం పడితే ధాన్యం తడిసిపోతుందనే భయం లేదు.
వనజాత, డీఎస్వో, మహబూబ్నగర్