నాగర్కర్నూల్, జూన్ 23 : జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల పంతుళ్లకు కరోనా నివారణ టీకా వేయనున్నారు. ఈ నెల 24 నుంచి ప్రారంభించనున్న ప్రత్యేక డ్రైవ్లో జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 26 వ్యాక్సినేషన్ కేంద్రాల్లో ఏర్పాట్లు చేపట్టారు. జూలై 1వ తేదీ నుంచి ప్రత్యక్ష తరగతులకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో ఉపాధ్యాయులకు వ్యాక్సిన్ ప్రక్రియను ప్రారంభించారు. జిల్లాలోని 1,163 ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, గురుకుల పాఠశాలల్లో పని చేస్తున్న 6,082 మంది ఉపాధ్యాయులకు వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ జరుగనుంది. స్పెషల్ డ్రైవ్తో జిల్లా వ్యాప్తంగా 20 మండలాల్లో ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. ప్రభుత్వం వచ్చే నెల నుంచి పాఠశాలల్లో తరగతులను ప్రత్యక్షంగా నిర్వహించాలని అనుమతించడంతో ఉపాధ్యాయులకు కరోనా టీకాను వేయించుకోవాలనే ప్రక్రియను ప్రారంభించనున్నారు. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన అందుబాటులో ఉన్న వ్యాక్సిన్ సెంటర్కు వెళ్లి తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు. వ్యాక్సిన్ వేయించుకునేందుకు వెళ్లే ఉపాధ్యాయులు కేంద్రాల వద్దకు ఐడెంటీ కార్డు, ఆధార్ కార్డులను తీసుకెళ్లాలని సూచించారు.
సమన్వయంతో వ్యాక్సిన్ వేయాలి
విద్య, వైద్య శాఖ అధికారులు సమన్వయంతో పని చేసి 100 శాతం ఉపాధ్యాయులకు వ్యాక్సినేషన్ ప్రక్రియను ఈ నెల 30వ తేదీ లోగా పూర్తి చేయాలని కలెక్టర్ శర్మన్ ఆదేశించారు. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్, ఇతర మేనేజ్మెంట్ల వారీగా 635 ప్రాథమిక పాఠశాలలు, 234 ప్రాథమికోన్నత పాఠశాలలు, 250 ఉన్నత పాఠశాలలు, 44 ఇంటర్ కళాశాలల్లో పని చేసే అధ్యాపకులు, ఉపాధ్యాయులు, సిబ్బంది ప్రత్యేక డ్రైవ్లో కనోనా టీకాను వేయించుకోవాలని సూచించారు.