అచ్చంపేట రూరల్, జూన్ 23: మున్సిపాలిటీ పరిధిలో చేపట్టనున్న పట్టణ ప్రగతి పనులకుగానూ ఆయా వార్డుల ప్రత్యేక అధికారులు, కౌన్సిలర్లు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని మున్సిపల్ చైర్మన్ నర్సింహగౌడ్ కోరారు. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జులై 1వ తేదీనుంచి ప్రారంభంకానున్న పట్టణ ప్రగతిలో చేపట్టనున్న పనులను గుర్తించాలని గుర్తు చేశారు. కాలనీల్లో శిథిలావస్థకు చేరిన ఇండ్లు, నీళ్లులేని బావులు, రోడ్లపై గుంతలను చదును చేయాలని, ముళ్ల పొదలను కొట్టేయాలని, పిచ్చి మొక్కలను తొలగించాలని పేర్కొన్నారు. పట్టణ ప్రగతితో పట్టణం అద్భుతంగా సుందరమైన పట్టణంగా ఏర్పాటు కావాలన్నారు. పట్టణంలోని ప్రజలు పట్టణ ప్రగతికి సహకరించాలని కోరారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ శ్రీహరిరాజు, కౌన్సిలర్లు రమేశ్, గౌరీశంకర్, ఏఈ మేఘనాథ్, పర్యావరణ ఇంజినీర్ ప్రవీణ్కుమార్ తదితరులు ఉన్నారు.