నాగర్కర్నూల్ టౌన్, ఏప్రిల్ 20: ప్రభుత్వ ఆదేశాల మేరకు మంగళవారం రాత్రి నుంచి విధించిన కర్ఫ్యూకు ప్రజలు సహకరించాలని కలెక్టర్ శర్మన్ ప్రకటనలో కోరారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ విధించిందని ఆయన స్పష్టం చేశారు. ఏప్రిల్ 30వ తేదీ వరకు రాత్రి 9 నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగుతుందని ఆయన తెలిపారు. దవాఖానలు, డయాగ్నస్టిక్ ల్యాబ్స్, ఫార్మాసూటికల్స్, నిత్యావసర సరుకులకు నైట్ కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఉంటుందన్నారు.
సీఐ గాంధీనాయక్ ఆధ్వర్యంలో..
కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం విధించిన రాత్రి కర్ఫ్యూకు ప్రజలు సహకరించాలని సీఐ గాంధీనాయక్ కోరారు. రాత్రి 9 నుంచి ఉదయం ఐదుగంటల వరకు ఎవరూ బయట తిరగొద్దని చెప్పారు. మే 1వ తేదీ వరకు రాత్రి కర్ఫ్యూ కొనసాగుతుందన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే విపత్తు నిర్వహణ చట్టం 2005 సెక్షన్ 51 నుంచి 60 ఐపీసీ సెక్షన్ 188తోపాటు ఇతర చట్టాల కింద కేసులు నమోదు చేస్తామన్నారు.
రాత్రి 9 నుంచి ఉదయం 5 గంటల వరకు..
కల్వకుర్తి రూరల్, ఏప్రిల్ 20: కరోనా రెండో దశ వేగంగా విస్తరిస్తున్న దృష్ట్యా ప్రభుత్వం కర్ఫ్యూ విధిస్తున్నట్లు డీఎస్పీ గిరిబాబు పేర్కొన్నారు. మంగళవారం కల్వకుర్తి పోలీస్స్టేషన్ శాంతి సలహా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ రాత్రి 9 నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగుతుందన్నారు. ఆ సమయంలో ఎవరూ బయటకు రావద్దన్నారు. పండుగల సం దర్భంగా ప్రజలు గుంపులుగా తిరగొద్దని, తప్పనిసరిగా మాస్కులు ధరించి భౌతికదూరం పాటించాలని కోరారు. అంతకుముందు సీఐ సైదులు, ఎస్సై భాస్కర్ వేపూర్ గ్రామంలో సీసీ కెమెరాలను ప్రారంభించారు.
తెల్లకపల్లిలో..
తెలకపల్లి, ఏప్రిల్ 20: మండలంలో రాత్రి 9 నుంచి ఉద యం 5గంటల వరకు కర్ఫ్యూ కొనసాగుతుందని ఎస్సై మాధవరెడ్డి మంగళవారం ప్రకటనలో తెలిపారు. కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందన్నారు. మాస్కు లేకుండా బయటకు వస్తే రూ.వెయ్యి జరిమానా విధిస్తామన్నారు.