స్తంభించిన రవాణా వ్యవస్థ
నిర్మానుష్యంగా రహదారులు
వెసలుబాటు సమయంలో ఉరుకులు, పరుగులు
అచ్చంపేట, మే 15: కరోనా నియంత్రణ కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న లాక్డౌన్ కొనసాగుతున్నది. ఉదయం 6 నుంచి 10గంటల వరకు నిత్యావసరాల కోసం ప్రజలు బయటకు వస్తున్నారు. పది గంటలు దాటిన తర్వాత వ్యాపారులు దుకాణాలు బంద్ చేస్తున్నారు. అచ్చంపేట డిపోలో బస్సులు వివిధ రూట్లల్లో తిరిగాయి. పదిగంటల తర్వాత బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. అంబేద్కర్ చౌరస్తాలో సిద్ధాపూర్, ఉప్పునుంతల ఎస్సైలు రాజు, రమేశ్ ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీ నిర్వహించారు. అనవసరంగా బయటకు వచ్చిన వారికి అవగాహన కల్పించి తిప్పి పంపించారు. అత్యవసరం కోసం వచ్చే వారికి గుర్తింపుకార్డులు తనిఖీ చేసి పంపారు. రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి.
అమ్రాబాద్ మండలంలో..
అమ్రాబాద్, మే 14: కరోన విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం విధించిన 20 గంటల లాక్డౌన్ శనివారం అమ్రాబాద్, పదర మండలాల్లో ప్రశాంతంగా కొనసాగింది. పది గంటల నుంచి అత్యవసర సర్వీసులు గ్యాస్ ఏజెన్సీస్, పెట్రోల్ బంకులు, మందుల దుకాణాలు, ఆర్ఎంపీ దవాఖానలు తప్ప మిగతావన్నీ మూసి వేయడంతో రహదారులన్నీ బోసిపోయాయి. ఈ సందర్బంగా గ్రామాల్లో రోడ్లపైకి ఎవరూ రాకుండా పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. లాక్డౌన్ సమయంలో అనవసరంగా తిరుగుతూ నిబంధనలను ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది కళ్యాణ్, రాంబాబు, మోజెస్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
పెంట్లవెల్లి మండలంలో..
పెంట్లవెల్లి, మే 15: కరోనా నేపథ్యంలో ప్రభుత్వం విధించిన లాక్డౌన్ మండలంలో నాలుగో రోజు శనివారం ప్రశాంతంగా కొనసాగింది. మండలంలోని వివిధ గ్రామాలతోపాటు, మండల కేంద్రంలో దుకాణా సముదాయాలు, పలురకాల వ్యాపార సంస్థలు ఉదయం 6 నుంచి 10 గంటల సమయం వరకు లాక్డౌన్ నిబంధనల మేరకు తమ వ్యాపారాలను కొనసాగించారు. నిత్యావసర సరుకులు కొనేందుకు వచ్చిన ప్రజలతో రోడ్లన్నీ కిక్కిరిశాయి. లాక్డౌన్ సడలింపు సమయం ముగియడంతో పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో ఒక్కసారిగా రోడ్లపై నుంచి జనాలు పరుగులు తీశారు. మండల కేంద్రంతోపాటు వివిధ గ్రామాల్లో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా స్థానిక ఎస్సై శ్రీనివాస్ తమ సిబ్బందితో గట్టి బందోబస్తు చర్యలు తీసుకుంటున్నారు.
నిర్మానుష్యంగా మారిన రహదారులు
కల్వకుర్తి రూరల్, మే 15: ప్రభుత్వ నిబంధనల మేరకు కల్వకుర్తిలో పకడ్బందీగా లాక్డౌన్ అమలు చేస్తుండడంతో ప్రధాన రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి. ఉదయం ఆరు నుంచి 10 గంటల వరకు అన్ని కార్యకలాపాలకు అనుమతినివ్వడంతో గ్రామాల నుంచి పది గంటలలోపు వచ్చి తిరిగి వెళ్లిపోతున్నారు. ప్రజలు తప్పకుండా మాస్క్ ధరించి భౌతికదూరం పాటించాలని, గుంపులుగుంపులుగా తిరుగొద్దని కల్వకుర్తి ఎస్సై మహేందర్ సూచించారు.
పెద్దకొత్తపల్లి మండలంలో..
పెద్దకొత్తపల్లి, మే 15: పెద్దకొత్తపల్లి మండలంలోని అన్ని గ్రామాల్లో లాక్డౌన్ ప్రశాంతంగా కొనసాగుతున్నది. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు ప్రజలు రోడ్లపైకి వచ్చి నిత్యావసర వస్తువులు కొనుగోలు చేస్తున్నారు. 10గంటల నుంచి వ్యాపార సంస్థలను మూసి వేయడంతో రాహదారులు, వ్యాపార సంస్థలు బోసిపోతున్నాయి. గ్రామాల్లో రోడ్లపైకి ఎవరూ రాకుండా పోలీసులు బందోబస్తు చర్యలు చేపట్టారు. లాక్డౌన్ సమయంలో ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాలు తప్పవని హెచ్చరిస్తున్నారు.
లాక్డౌన్తో బోసిపోయిన రోడ్లు
బిజినేపల్లి, మే 15: లాక్డౌన్తో మండలంలోని ప్రధాన రహదారులు బోసిపోయాయి. కేవలం 4గంటల పాటే కొనుగోళ్లు జరుగుతున్నాయి. 10గంటల తర్వాత రోడ్లన్నీ నిర్మానుష్యంగా కన్పిస్తున్నాయి. దీనికితోడు నిబంధనలు అతిక్రమించి బయట తిరిగే వారికి పోలీసులు జరిమానా విధిస్తున్నారు. మంగనూర్ సమీపంలో జిల్లా సరిహద్దు చెక్పోస్టు ఏర్పాటు చేసి స్థానిక పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.
తెలకపల్లి మండలంలో..
తెలకపల్లి, మే 15 : తెలకపల్లిలో శనివారం లాక్డౌన్ సంపూర్ణంగా కొనసాగింది. లాక్డౌన్ సమయంలో అనవసరంగా రోడ్లపైకి వచ్చే వాహనాలను ఆపి పోలీసులు తనిఖీలు చేస్తూ జరిమానాలు విధిస్తున్నారు. వ్యాపారసంస్థల యజమానులు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ లావాదేవీలు జరపాలని ఎస్సై మాధవరెడ్డి సూచించారు.
కిక్కిరిసిన జనంతో రైతుబజార్
నాగర్కర్నూల్, మే 15: ప్రభుత్వం విధించిన లాక్డౌన్ కొనసాగుతున్నది. ఉదయం వెసలుబాటుసమయంలో రైతుబజార్, వస్త్ర, వ్యాపార, నిత్యావసర సరుకుల దుకాణాలు కిక్కిరిసి కనిపిస్తున్నాయి. మధ్యాహ్నం సమయంలో ప్రధాన కూడళ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఇతర ప్రాంతాల నుంచి దవాఖానకు వచ్చినవారు మధ్యాహ్న సమయంలో భోజనాలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కలెక్టర్, అదనపు కలెక్టర్, ఎస్పీ సాయిశేఖర్ ఆధ్వర్యంలో అధికారులు పర్యవేక్షణ చేస్తున్నారు. ఇక శుభకార్యాలకు సైతం వెళ్లాలంటే జంకుతున్నారు. అంత్యక్రియలకు 20మంది, శుభకార్యాలకు 50మందికి మాత్రమే ప్రభుత్వం అనుమతినివ్వడంతో ఆదిశగా చర్యలు తీసుకుంటూ కార్యక్రమాలు జరుపుకొంటున్నారు.
లాక్డౌన్ ప్రశాంతం
తాడూరు, మే 15: మండలకేంద్రంతోపాటు ఆయా గ్రామాల్లో లాక్డౌన్ ప్రశాంతంగా కొనసాగింది. 10గంటల తర్వాత ఒక్కరు కూడా రోడ్డుపైకి రాలేదు. ఎస్సై వీరబాబు ఆధ్వర్యంలో గ్రామాల్లో పర్యటించి లాక్డౌన్ అమలుతీరును పర్యవేక్షించారు.