అదనపు సివిల్ కోర్టులతో త్వరగా విచారణ
ప్రజలు, న్యాయవాదులకు తగ్గిన వ్యయప్రయాసాలు
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి హిమాకోహ్లి
నాగర్కర్నూల్, జూన్14: జిల్లాలో ఒకేరోజు మూడు అదనపు జూనియర్ సివిల్ కోర్టులు ప్రారంభించుకోవడం ద్వారా కేసుల సత్వర విచారణకు ఎంతో దోహదపడుతుందని హైకోర్టు న్యాయమూర్తి హిమాకోహ్లి అన్నారు. సోమవారం హైదరాబాద్ నుంచి వర్చువల్ సమావేశం ద్వారా నాగర్కర్నూల్లో 2వ అదనపు జూనియర్ సివిల్ కోర్టును ఆమె ప్రారంభించారు. ప్రత్యక్షంగా మహబూబ్నగర్ జిల్లా జడ్జి ప్రేమావతి ప్రారంభించారు. ఈ సందర్భంగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి హిమాకోహ్లి మాట్లాడుతూ సివిల్ కోర్టు కేసుల విచారణ కోసం మహబూబ్నగర్ లేదా హైదరాబాద్కు వెళ్లాల్సి వచ్చేదని, నేడు వ్యయప్రయాసాలు తగ్గిపోనున్నాయని చెప్పారు. బార్ అసోసియేషన్, న్యాయవాదులు సమన్వయంతో పనిచేసి కేసులను సత్వర విచారణ చేసి బాధితులకు న్యాయం చేయాలని సూచించారు.
అనంతరం రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి అభిషేక్రెడ్డి మాట్లాడుతూ నాగర్కర్నూల్ జిల్లాలో ఒకేరోజు మూడు అదనపు జూనియర్ సివిల్ కోర్టులను ప్రారంభించడంపై శుభాకాంక్షలు తెలిపారు. నాగర్కర్నూల్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మధుసూదన్రావు మాట్లాడుతూ జిల్లాలో అదనపు జూనియర్ సివిల్ కోర్టులు ప్రారంభించినందుకు ప్రధాన న్యాయమూర్తికి ధన్యవాదాలు తెలిపారు. సివిల్ కోర్టుకు కావాల్సిన మౌలిక సదుపాయాలు, సిబ్బంది, న్యాయమూర్తులను కేటాయించాల్సిందిగా కోరారు. కోర్టు కొత్త భవనం గత నవంబర్ వరకు 95 శాతం పూర్తయిందని, మిగిలిన 5శాతం పెండింగ్లో ఉందని తెలిపారు. ప్రస్తుతం ప్రారంభించుకున్న రెండో అదనపు జూనియర్ సివిల్ కోర్టు స్థలం బార్ అసోసియేషన్కు సంబంధించిందని, ఇప్పుడు బయట కూర్చొనే పరిస్థితి వచ్చిందన్నారు. సీజేసీ ప్రత్యేక చొరవ తీసుకొని కొత్త భవన నిర్మాణం పూర్తి చేయడంతోపాటు జుడీషియల్ గెస్ట్హౌస్ నిర్మాణానికి ఆదేశాలు ఇవ్వాలని కోరారు. న్యాయస్థానానికి జిల్లాలో 20 ఎకరాల స్థలాన్ని గుర్తించి ప్రభుత్వం ద్వారా వెంటనే అప్పగించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను కోరారు. కోర్టు భవనానికి ప్రహరీ లేకపోవడంతో భవనం వద్ద పోలీస్ చెక్పోస్టును ఏర్పాటు చేయాలని ఎస్పీకి సూచించారు. కార్యక్రమంలో నాలుగో అదనపు సెషన్స్ జడ్జి రవికుమార్, సీనియర్ సివిల్ జడ్జి శీతల్, మొబైల్కోర్టు మెజిస్ట్రేట్ మురళీమోహన్, జూనియర్ సివిల్ జడ్జి స్వరూప, ఎస్పీ సాయిశేఖర్, అదనపు కలెక్టర్ శ్రీనివాస్రెడ్డి, బార్ అసోసియేషన్ సభ్యులు, న్యాయవాదులు పాల్గొన్నారు.
కొల్లాపూర్లో కోర్టుల ప్రారంభం
కొల్లాపూర్ రూరల్, జూన్14: అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టుల ద్వారా కేసులు సత్వర విచారణకు నోచుకుంటాయని మహబూబ్నగర్ మొదటి అదనపు జిల్లా జడ్జి రఘురాం పేర్కొన్నారు. సోమవారం కొల్లాపూర్ మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టు సముదాయంలో మొదటి, రెండో అదనపు జూనియర్ సివిల్ కోర్టులను హైదరాబాద్ నుంచి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి హిమాకోహ్లి వర్చువల్ సమావేశం ద్వారా.. ప్రత్యక్షంగా రఘురాం ప్రారంభించారు. స్థానిక బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కొత్త కోర్టుల ఏర్పాటుతో మరింత త్వరగా విచారణ జరగనున్నదన్నారు. అనంతరం న్యాయమూర్తి రఘురాం, కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డిని స్థానిక బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సన్మానించారు. అలాగే బార్ అసోసియేషన్ అధ్యక్షుడు భాస్కర్రెడ్డి ఆధ్వర్యంలో మాజీ అధ్యక్షుడు, సీనియర్ న్యాయవాది బాలీశ్వరయ్య, శ్రీనివాసరావును సత్కరించారు. ఈ సందర్భంగా బాలీశ్వరయ్య మాట్లాడుతూ జూనియర్ కోర్టుల ప్రారంభంతో సాధ్యమైనంత మేరకు కేసుల విచారణ త్వరితగతిన పూర్తయ్యేందుకు కృషి చేస్తామన్నారు.
రూ.5 లక్షల నిధుల మంజూరుకు ఎమ్మెల్యే హామీ
జూనియర్ కోర్టుల ప్రారంభానికి హాజరైన ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి బార్ అసోసియేషన్ విజ్ఞప్తి మేరకు కోర్టుల ఆవరణలో నిర్మాణాలను చేపట్టేందుకు తన నిధుల నుంచి రూ.5 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. కక్షిదారులతో పాటు కోర్టు సిబ్బంది, కేసుల నిమిత్తం వచ్చే వివిధ శాఖల అధికారుల వాహనాలు నిలిపేందుకు, విశ్రాంతి తీసుకునేందుకు వీలుగా షెడ్ల నిర్మాణం చేపట్టేందుకు ఈ నిధులు వెచ్చించాలని, ఇందుకు హైకోర్టు నుంచి అనుమతి పొందాలని సూచించారు. కార్యక్రమంలో జూనియర్ సివిల్ జడ్జి కుమారి గోవిందలక్ష్మి, అదనపు కలెక్టర్ మనూ చౌదరి, కొల్లాపూర్ జూనియర్ సివిల్ జడ్జి కుమారి, ఆర్డీవో హనుమానాయక్, మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మీచారి, వనపర్తి డీఎస్పీ కిరణ్కుమార్, కొల్లాపూర్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు భాస్కర్రెడ్డి, శ్రీనివాసరావు, ఉపేందర్, వసంతరెడ్డి, సహాయ పబ్లిక్ ప్రాసిక్యూటర్ మనోహర్, బార్ అసోసియేషన్ సభ్యులు, సీఐ వెంకట్రెడ్డి, ఎస్సై బీవీ రమణ, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.