అచ్చంపేట, జూన్ 8: అచ్చంపేట హిందూ శ్మశానవాటికలో వసతుల కల్పనకు రూ.కోటీ లక్షా నిధులతో పనులు కొనసాగుతున్నాయని, పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అచ్చంపేట మున్సిపల్ చైర్మన్ నర్సింహగౌడ్ అన్నారు. శ్మశానవాటికలో చేపడుతున్న పనులను మంగళవారం పరిశీలించారు. శ్మశానవాటిక చుట్టూ ప్రహరీ నిర్మాణం, సీసీరోడ్డు, స్నానపు గదులు, నీటి వసతి, లైట్లు, దహస సంస్కారాలు నిర్వహించేందుకు కావాల్సిన వసతులు, సామగ్రి భద్రపర్చుకునే గదులు తదితర పనులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని శ్మశానవాటిక అభివృద్ధి కోసం రూ.కోటీ లక్షా నిధులు కేటాయించి పనులు ప్రారంభించారన్నారు. శ్మశానవాటికలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అన్ని వసతులు కల్పించే విధంగా పనులు కొనసాగుతున్నాయన్నారు. మూడు నెలల్లో పనులు పూర్తి చేయాలని సూచించారు.
పనులు ఆలస్యం కావడానికి కారణాలు అడిగి తెలుసుకున్నారు. వర్షాకాలం ప్రారంభమైనందున పనులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. దహన సంస్కారాలు నిర్వహించేక్రమంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. శ్మశానవాటికలో దహన సంస్కారాలు నిర్వహించే వరకు తాత్కాలికంగా మున్సిపల్ నుంచి నీటి వసతి ట్యాంకర్ ఏర్పాటు చేయాలని లేకపోతే చిన్నపాటి నీటిట్యాంకర్ నిర్మించి నీటి వసతి కల్పించాలన్నారు. ట్యాంకర్ అక్కడే ఉంచడంతో కాలనీల్లో నీటి పంపిణీ ఇబ్బందిగా మారుతుందని, దీంతో నీటిట్యాంకు నిర్మాణం చేపట్టి నీటి వసతి కల్పించాలన్నారు. నీటి వసతి కోసం చిన్నిపాటి ట్యాంకు నిర్మాణం కోసం స్థలాన్ని పరిశీలించారు. పనులు సత్వరమే పూర్తి చేయాలన్నారు. ఆయన వెంట మున్సిపల్ కమిషనర్ శ్రీహరిరాజు, ఏఈ మేఘనాథ్, కౌన్సిలర్లు మనోహర్ప్రసాద్, గడ్డంరమేశ్, గౌరిశంకర్, సోమ్లా, వెంకటేశ్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.