సీఎం కేసీఆర్ ఆదేశాలతో కదిలిన యంత్రాంగం
జోగుళాంబ గద్వాల జిల్లాలోనే 102.3క్వింటాళ్ల నకిలీ విత్తనాలు స్వాధీనం
పోలీసుల అదుపులో ప్రముఖ సీడ్ ఆర్గనైజర్లు
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న దాడులు
నకిలీ విత్తన దందాపై చెక్
మహబూబ్నగర్ జూన్ 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): నకిలీ విత్తనాలు.. కష్టపడకుండా కోట్లు కొల్లగొట్టి రైతులను నట్టేటా ముంచే మోసపు దందా. ఈ దందాతో అక్రమార్కులు కోట్లకు పడగలెత్తుతుంటే ఆరుగాలం కష్టపడి పంట పండించే రైతన్న మాత్రం అప్పుల పాలవుతున్నాడు. రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్ అందించినా చాలాచోట్ల రైతుల జీవితాల్లో మార్పు రావడం లేదని గమనించిన సీఎం కేసీఆర్.. రైతుకు అన్యాయం చేస్తున్న మాఫియాపై ఉక్కుపాదం మోపేందుకు ఆదేశాలు జారీ చేశారు. నకిలీ విత్తనాలు తయారీ చేసేవారు, విక్రయించే వారు ఎంతటి వారైనా జైల్లో వేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. వారికి సహకరించే వ్యవసాయ, ఇతర శాఖల అధికారులపైనా కేసులు నమోదు చేయాలని స్పష్టం చేశారు.
నకిలీ విత్తనాలపై పోలీసులు కఠినంగా వ్యవహించాలని ఆదేశించడంతో ఉమ్మడి జిల్లాలో పోలీసు యంత్రాంగం నకిలీల పని పడుతోంది. ఇప్పటివరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 40కి పైగా కేసులు నమోదు చేసి 150క్వింటాళ్ల నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో సింహభాగం జోగుళాంబ గద్వాల జిల్లాలో కావడం గమనార్హం. ఎంతటి వారినైనా మేనేజ్ చేయడంలో సిద్ధహస్తులైన గద్వాల విత్తన మాఫియా ఆగడాలకు పోలీసులు చెక్ పెట్టారు. ప్రముఖ పత్తి విత్తనాల ఆర్గనైజర్ బండ్ల రాజశేఖర్రెడ్డిని పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. దీంతో నకిలీ విత్తనాల మార్కెట్ చేసే మాఫియా షేక్ అవుతోంది. సరైన ప్యాకింగ్, లాట్ నెంబర్లు లేకుండా, తక్కువ ధరకు విడిగా విత్తనాలు ఎవరు అమ్మినా తమకు సమాచారం ఇవ్వాలని అధికారులు కోరుతున్నారు. అధికారిక డీలర్ల వద్ద తప్పనిసరిగా రశీదు తీసుకునే విత్తనాలు కొనుగోలు చేయాలని సూచిస్తున్నారు.
ప్రముఖ సీడ్ ఆర్గనైజర్లు అరెస్టు
గద్వాలకు చెందిన ప్రముఖ సీడ్ ఆర్గనైజర్ బండ్ల రాజశేఖర్రెడ్డిపై సోమవారం పోలీసులు కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. గద్వాల రూరల్ పోలీస్స్టేషన్ పరిధిలో మూడు రోజుల కిందట రమ్య ఇండస్ట్రీస్లో నకిలీ విత్తనాలు ఉన్నాయన్న సమాచారంతో టాస్క్ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించి 72 బ్యాగ్లలో 3434.5 కేజీలను గుర్తించి స్వాధీనం చేసుకొని బాధ్యులైన బండ్ల రాజశేఖర్రెడ్డి, ఎం విజయ్భాస్కర్రెడ్డిపై కేసు నమోదైంది. పోలీసులు ఇద్దరినీ జ్యుడిషియల్ రిమాండ్కు తరలించారు. రాజశేఖర్రెడ్డికి చెందిన రమ్య ఇండస్ట్రీస్లో ఫెయిల్యూర్ అయిన పత్తి విత్తనాలను నిల్వ ఉంచగా పోలీసులు వాటిని స్వాధీనం చేసుకుని ఆయనను అరెస్టు చేసినట్లు ఎస్పీ రంజన్త్రన్ కుమార్ తెలిపారు.
గద్వాలలో ఫెయిల్యూర్ విత్తనాలను నాశనం చేయకుండా, తిరిగి రైతులకూ ఇవ్వకుండా కొందరు ఆర్గనైజర్లే తమ వద్ద ఉంచుకుని తిరిగి ప్యాక్ చేసి రైతులకు తక్కువ ధర పేరిట విక్రయించడం ఎప్పటి నుంచో జరుగుతోంది. ఈ నకిలీ దందా వల్లే కోట్లకు పడగలెత్తి ఎంతటి వారినైనా శాసించగలమనే స్థాయికి మాఫియా చేరుకున్నది. అయితే సాక్షాత్తు సీఎం కేసీఆరే నకిలీ మకిలిపై యుద్ధం ప్రకటించడంతో అక్రమార్కులకు సహకరించేవారు సైతం సందిగ్ధంలో పడిపోయారు. అనామకులపై కేసులు పెట్టి తప్పించుకునే ప్రయత్నం చేసినా చివరకు పట్టువదలకుండా అసలు నిందితులనే పోలీసులు అరెస్టు చేసేవరకు పరిస్థితి వచ్చేసింది. ఇదంతా సీఎం కేసీఆర్ తీసుకున్న కఠిన నిర్ణయాల ఫలితమేనని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
వదిలే ప్రసక్తే లేదు..
ప్రభుత్వ ఆదేశాలు, డీజీపీ ఉత్తర్వుల మేర కు నకిలీ విత్తన దం దాపై పెద్దఎత్తున దాడు లు చేస్తున్నాం. నకిలీ విత్తనాల తయారీ, విక్రయంలో ప్రమేయమున్న ఎంతటి వారినైనా వదిలే ప్రసక్తే లేదు. గతేడాది 34 కేసుల్లో 3600 కేజీల విత్తనాలు పట్టుబడగా 54మందిపై కేసులు నమోదు చే శాం. ఈ ఏడాది మరింత ఉధృతంగా దాడులు కొనసాగిస్తున్నాం. టాస్క్ఫోర్స్ బృందం ఏర్పా టు చేసి నిత్యం దాడులు చేస్తున్నాం. 15రోజులుగా పలు ప్రాంతాల్లో దాడులు నిర్వహించి ఇప్పటివరకు 10,230 కేజీల నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకున్నాం. 18మందిపై 15 కేసులు నమోదు చేశాం. ఎవరైనా నకిలీ విత్తనాలు అమ్ముతున్నట్లు మీ దృష్టికి వస్తే పోలీసుల దృష్టికి తీసుకురావాలి. డయల్ 100, కంట్రోల్ రూమ్ నంబర్ 9494921100కు సమాచారం ఇస్తే వెంటనే అక్రమార్కుల భరతం పడతాం. సమాచారం అందించే వారి వివరాలు గోప్యంగా ఉంటాయి. ఈ నకిలీ చైన్లో ఎంతటి వారు ఉన్న ఉపేక్షించేది లేదు. డీలర్లు, ఆర్గనైజర్లు విత్తన చట్టంలోని నిబంధనలను అనుసరించాలి. ఫెయిల్ అయిన సీడ్స్ డీలర్లు, ఆర్గనైజర్లు, రైతులు ఎవరి దగ్గర దొరికినా కేసులు నమోదు చేస్తాం. గద్వాలకు చెందిన రమ్య ఇండస్ట్రీస్ ఓనర్, సీడ్ ఆర్గనైజర్ ఎ1 బండ్ల రాజశేఖర్రెడ్డి, ఏ2 విజయ్ భాస్కర్రెడ్డిపై కేసులు నమోదు చేసి అరెస్టు చేశాం. భవిష్యత్లోనూ అక్రమార్కులను వదిలిపెట్టే ప్రసక్తే లేదు.