జడ్చర్ల, అచ్చంపేట మున్సిపాలిటీల్లో ఉత్కంఠ
సీల్డ్కవర్లో భవితవ్యం
కొవిడ్ నిబంధనల మేరకు ఏర్పాట్లు
పర్యవేక్షించిన కలెక్టర్, అదనపు కలెక్టర్లు
జడ్చర్ల టౌన్, మే6: జడ్చర్ల మున్సిపాలిటీ చైర్పర్సన్, వైస్ చైర్మన్ ఎన్నిక కోసం కొవిడ్ నిబంధనల మేరకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు ఎన్నిక ప్రక్రియ మొదలుకానున్నది. మొదటగా మున్సిపాలిటీ పరిధిలోని 27వ వార్డుల్లో గెలుపొందిన అభ్యర్థులకు స్థానిక సంస్థల, జిల్లా అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ సమక్షంలో ప్రమాణ స్వీకారం కార్యక్రమం నిర్వహించనున్నారు. తర్వాత చైర్పర్సన్, వైస్ చైర్మన్ ఎన్నిక ఉండనున్నది. అభ్యర్థులు, అవసరమైన సిబ్బందిని మాత్రమే అనుమతించనున్నారు. ఇప్పటికే ఈ ఎన్నికకు సంబంధించి గెలుపొందిన అభ్యర్థులకు సమాచారం అందించినట్లు మున్సిపల్ కమిషనర్ సునీత తెలిపారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా టీఆర్ఎస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకున్న నేపథ్యంలో మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ నిమిత్తం అధిష్టానం పార్టీ పరిశీలకుడిగా తెలంగాణ సివిల్ సప్లయి కార్పొరేషన్ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్రెడ్డిని నియమించింది. నేటి ఉదయం ఆయన జడ్చర్లకు చేరుకుని ముందుగా పార్టీ తరపున గెలిచిన అభ్యర్థులతో సమావేశమై దిశానిర్దేశం చేయనున్నారు. తర్వాత పార్టీ అధిష్టానం అందజేసిన సీల్డ్ కవర్లో ఉన్న చైర్పర్సన్, వైస్ చైర్మన్ల పేర్లను ప్రకటించనున్నారు. అయితే పదవులు ఎవరిని వరిస్తాయో అన్న ఉత్కంఠ అభ్యర్థుల్లో నెలకొన్నది.
అచ్చంపేటలో..
అచ్చంపేట, మే 6: అచ్చంపేట మున్సిపల్ నూతన పాలకవర్గం గురువారం కొలువుదీరనున్నది. పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల సరోజినీదేవి ఆడిటోరియంలో ప్రమాణస్వీకారోత్సవానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. గురువారం మధ్యాహ్నం 3 గంటలకు కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం చైర్మన్, వైస్ చైర్మన్లను ఎన్నుకోనున్నారు. అయితే 20వార్డులకుగానూ 13వార్డులను టీఆర్ఎస్, 6వార్డులను కాంగ్రెస్, ఒకవార్డును బీజేపీ గెలుచుకుంది. అయితే చైర్మన్, వైస్చైర్మన్ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులే ఉండనున్నారు. మున్సిపాలిటీపై రెండోసారీ గులాబీ జెండా ఎగిరింది.
సీల్డ్ కవర్లో చైర్మన్, వైస్ చైర్మన్ పేర్లు
అచ్చంపేట మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. అయితే చైర్మన్, వైస్చైర్మన్లను ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించి సీల్డ్కవర్లో వారి పేర్లను పంపించనున్నారు. పరిశీలకులుగా రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డిని నియమించారు. ప్రమాణస్వీకారానికి మంత్రి నిరంజన్రెడ్డి, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు హాజరుకానున్నారు. పార్టీ, ప్రజల కోసం అంకితభావంతో పనిచేసే వారికి మరిన్ని అవకాశాలు ఉంటాయని విప్ గువ్వల బాలరాజు పేర్కొన్నారు. కొవిడ్ సోకిన కౌన్సిలర్లు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.