నాగర్కర్నూల్, జూన్ 2: జిల్లాలో నకిలీ విత్తనాలు సరఫరా చేసినా, అమ్మినా, వారికి సహకరించినా జైలుకు పంపిస్తామని ఎస్పీ సాయిశేఖర్ హెచ్చరించారు. బుధవారం జిల్లా పోలీస్ హెడ్క్వార్టర్స్లో విత్తన సరఫరా, పెస్టిసైడ్స్ సరఫరా దుకాణదారులు, డీలర్లతో ఎస్పీ సమావేశమయ్యారు. జిల్లాలో ఎక్కడైనా నకిలీ విత్తనాలు సరఫరా, క్రయవిక్రయాలు జరిగితే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. బయట ప్రాంతాల నుంచి వచ్చి గ్రామాల్లో రైతులకు నకిలీ విత్తనాలు సరఫరా చేసే వారి సమాచారాన్ని పోలీసులకు లేదా వ్యవసాయాధికారులకు తెలియజేయాలని సూచించారు. గుర్తింపు పొందిన కంపెనీలకు సంబంధించిన విత్తనాలనే డీలర్లు రైతులకు విక్రయించాలని సూచించారు. విత్తనాలు, ఫెస్టిసైడ్స్ విక్రయిస్తే తప్పనిసరిగా రైతులకు బిల్లులు ఇవ్వాలని ఆదేశించారు. కరోనా సమయంలో వ్యాపారులంతా తమ దుకాణాల వద్ద భౌతికదూరం పాటిస్తూ ముగ్గుతో రింగులు వేసుకోవలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి వెంకటేశ్వర్లు, సీఐ గాంధీనాయక్, ఎస్సై విజయ్కుమార్, ఏవో నర్మద, వ్యవసాయ, పోలీస్శాఖ అధికారులు పాల్గొన్నారు.
నకిలీ విత్తనాలు విక్రయిస్తే చర్యలు
మండలంలో నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్సై కృష్ణయ్య, ఏవో నాగార్జునరెడ్డి దుకాణాదారులను హెచ్చరించారు. బుధవారం మండల కేంద్రంలోని ఆయా ఫర్టిలైజర్ దుకాణాలను పోలీస్, వ్యవసాయ శాఖలు ఆధ్వర్యంలో తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వానకాలం సీజన్ సమీపిస్తుండడంతో నకిలీ విత్తనాలు, నాసిరకం ఎరువులు ఎవరైన అమ్మినా చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. రైతులు కూడా నకిలీ విత్తనాలు కొనుగోలు చేయకూడదని, ప్రభుత్వ అనుమతులు పొందిన దుకాణాల ద్వారానే విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేయాలన్నారు. నకిలీ విత్తనాలు విక్రయిస్తున్నట్లు తమ దృష్టికి వస్తే లైసెన్స్ రద్దు చేయనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ట్రైనీ ఎస్సైలు నాగరాజురెడ్డి, చంద్రశేఖర్ పాల్గొన్నారు.
నకిలీలు విక్రయిస్తే చర్యలు
నకిలీ విత్తనాలు, ఎరువులు, మందులు అమ్మి రైతులను మోసం చేస్తే జైలుకు పంపిస్తామని ప్రత్యేక స్ట్రైక్ఫోర్స్ మండల వ్యావసాయ అధికారి సందీప్ అన్నారు. బుధవారం మండలంలోని అన్ని ఫర్టిలైజర్, పెస్టిసైడ్ దుకాణాలను పోలీసులతో కలిసి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ లైసెన్సులు లేకుండా నకీలీలకు పాల్పడితే చర్యలు తప్పవన్నారు. ప్రతి దుకాణాదారుడు విత్తనాల విక్రయ రసీదులు ఇవ్వాలని, పూర్తి సమాచారం రికార్డుల్లో పొందుపర్చాలని సూచించారు. అదేవిధంగా రైతులు అడిగిన విత్తనాలు మాత్రమే ఇవ్వాలని తెలిపారు. ధరల పట్టికలను బహిర్గతం చేయాలని తెలిపారు. కార్యక్రమంలో ఎస్సైలు వెంకటయ్య, పోచయ్య, ఫర్టిలైజర్ దుకాణాదారులు పాల్గొన్నారు.
ఫర్టిలైజర్ దుకాణాల తనిఖీ
మండల కేంద్రంలోని విత్తనాలు, ఎరువుల దుకాణాల్లో మండల వ్యవసాయ అధికారి కమల్కుమార్, ఎస్సై శ్రీనివాసులు బుధవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు రికార్డులను పరిశీలించారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు ఇవ్వాలని, రైతుకు తప్పనిసరిగా రసీదు ఇవ్వాలన్నారు. ప్రతి బిల్లుపై దుకాణం యజమానితోపాటు, రైతు సంతకం ఉండాలని ఆదేశించారు. క్రయవిక్రయాల రికార్డులు సక్రమంగా నిర్వహించాలన్నారు. కొవిడ్ నిబంధనలు పాటించాలని, క్యూఆర్ కోడ్ అందుబాటులో ఉంచి, నగదు రహిత లావాదేవీలు నిర్వహించాలన్నారు. నకిలీ విత్తనాలు విక్రయిస్తే చర్యలు కఠినంగా ఉంటాయని, పీడీ యాక్ట్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. తనిఖీలో ప్రొబేషనరీ ఎస్సై ప్రణిత తదితరులు పాల్గొన్నారు.