నాగర్కర్నూల్, జనవరి 23 (నమస్తే తెలంగాణ) : దళితబంధు పథకం అమలుకు ప్రభు త్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం జిల్లాలోని చారకొండలో పైలట్ ప్రాజెక్టుగా ఈ పథకం అమలవుతోంది. ఈ పథకంలో భాగంగా ప్రతి దళిత కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందనున్నది. ఆయా కుటుంబాలు కోరినట్లుగా ఉపాధికి ప్రభుత్వం ఈ సాయం నేరుగా మంజూరు చేస్తుంది. ఎలాంటి బ్యాంక్ లింకేజీలు లేకుండా కలెక్టర్ ద్వారా అర్హులకే దళితబంధు పథకం చేరేలా నిబంధనలు రూపొందించారు. ఇప్పటికే మండలంలో సర్వే చేపట్టారు. 2 వేలకు పైగా కుటుంబాలు లబ్ధిదారులుగా ఉన్నారు. ఇదిలా ఉంటే పథకం అమలుపై ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేశాయి. దీన్ని తిప్పికొట్టేలా సీఎం కేసీఆర్ నిర్ణయించడం విశేషం. దీంతో రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో ఈ పథకం అమలు కానున్నది. దీనికిగానూ ప్రస్తుతం ప్రతి నియోజకవర్గం నుంచి వంద మందిని దళితబంధు పథకానికి ఎంపిక చేస్తారు. అర్హులైన లబ్ధిదారులను ఫిబ్రవరి 5వ తేదీ నాటికి గుర్తించనున్నారు. దీని కోసం జిల్లాల సాంఘిక సంక్షేమ శాఖ, పంచాయతీ, రెవెన్యూ, ఇతర శాఖలు సమన్వయంతో పని చేస్తాయి. గుర్తించిన లబ్ధిదారులకు అదే నెల 10వ తేదీనాటికే బ్యాంకు ఖాతాలు ప్రత్యేకంగా తెరిపిస్తారు.
ఆయా లబ్ధిదారుల కుటుంబ సమగ్ర సమాచారాన్ని సేకరిస్తారు. గుర్తించిన లబ్ధిదారులకు మార్చి 7వ తేదీలోగా దళితబంధు నిధులు అందజేస్తారు. అది వందశాతం పూర్తయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ పథకం పర్యవేక్షణకు నియోజకవర్గానికి ఒక సీనియర్ జిల్లా స్థాయి అధికారి నోడల్ అధికారిగా ఉంటారు. ఇక లబ్దిదారులను గుర్తించే బాధ్యత నియోజకవర్గ ఎమ్మెల్యేలు చేపడుతారు. నియోజకవర్గంలో వంద మందిని ఎంపిక చేసేందుకుగానూ ఏవైనా ఒకట్రెండు గ్రామాలను ఎంపిక చేయాల్సి ఉంటుంది. ఈ ఎంపికలో పూర్తి బాధ్యత ఎమ్మెల్యేలకే ప్రభుత్వం అప్పగించింది. ప్రభుత్వం అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి, షాదీముబారక్, సీఎంఆర్ఎఫ్, రంజాన్, బతుకమ్మ, క్రిస్మస్ సంబురాల దుస్తుల పంపిణీ వంటి పథకాలు ఎమ్మెల్యేల చేతుల మీదుగానే జరుగుతున్నది. దీంతో ఎమ్మెల్యేలకు క్షేత్రస్థాయిలో అర్హుల ఎంపిక సులువవుతుందన్నది ప్రభుత్వ ఉద్దేశం. లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి త్వరలో మార్గదర్శకాలు విడుదల కానున్నాయి. దళితులు తమకు నచ్చిన వ్యాపారాలు నిర్వహించుకునేందుకు ఇందులో అవకాశం ఉంటుంది. ప్రస్తుతం చారకొండలో అమలవుతున్నట్లుగానే యూనిట్ల కేటాయింపులు జరగనున్నాయి.
ఫోటో స్టూడియో, టెంట్ హౌస్, కార్లు, ఆటోలు, ట్రాక్టర్లు, హోటళ్లలాంటి పలు వ్యాపారాలు చేసుకునేందుకు ప్రభుత్వం లబ్ధిదారుల ఆసక్తికి ప్రాధాన్యత ఇచ్చింది. మొత్తంమీద దళితులపై సీఎం కేసీఆర్ తన ఉదారతను చాటుకొంటున్నారు. ఇప్పటికే రాజకీయంగా స్థానిక సంస్థలు, మార్కెట్, జిల్లా పరిషత్ల్లో రిజర్వేషన్లు కేటాయించారు. దళితవాడల అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులను మంజూరు చేస్తున్నారు. వ్యక్తిగతంగా కూడా దళితులను ముందుకు తీసుకొచ్చేందుకు దేశంలో ఎక్కడా లేని విధంగా దళితబంధు పథకాన్ని తీసుకురావడం విశేషం. ఎలాంటి నిధుల కొరత లేకుండా ప్రభుత్వం ఈ పథకం అమలుకు రూ.1200 కోట్లు విడుదల చేయడం గమనార్హం. దీనికి మంజూరు చేసే నిధులను ప్రభుత్వం కలెక్టర్ల ఖాతాలో జమ చేయడం జరిగింది. పథకం అమలుకై జిల్లాలోని ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగానికి కలెక్టర్ ఆధ్వర్యంలో సమీక్షా సమావేశాలు నిర్వహించనున్నారు. ప్రస్తుతం నాగర్కర్నూల్ జిల్లాలో చారకొండలో ఈ పథకం అమలవుతోండగా ప్రతి నియోజకవర్గంలో వంద మంది చొప్పున 400 మందికి వచ్చే మార్చి వరకు రూ.10 లక్షల దళితబంధు నిధులు మంజూరు కానున్నాయి. ఈ పథకం అమలుపై జిల్లాలోని దళిత వర్గాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
సీఎం కేసీఆర్ దళితబాంధవుడు
సీఎం కేసీఆర్ దళిత పక్షపాతిగా మారారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలో దళితుల అభ్యున్నతికి సీఎం కృషి చేస్తున్నారు. దళితబంధు పథకం వల్ల ఎస్సీలు ఆర్థిక అభివృద్ధిలో ముందుకు సాగుతారు. దీనివల్ల సామాజిక అంతరాలూ తొలగిపోతాయి. సీఎం కేసీఆర్కు దళితుల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నా.
ప్రతి దళిత కుటుంబానికి..
దేశంలో ఏ రాష్ట్రంలో లేని గొప్ప పథకం దళితబంధు. నియోజకవర్గంలో గ్రామం, అర్హులైన లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా చేసేందుకు చర్యలు తీసుకుంటాను. రాబోయే రోజుల్లో ప్రతి దళిత కుటుంబానికి ఈ దళితబంధు పథకం ద్వారా రూ.10 లక్షల సాయం అందుతుంది. ఈ పథకం ఎన్నికల కోసమని ప్రతిపక్షాలు చేసిన తప్పుడు ప్రచారం మాయలో దళితులు పడొద్దు. సీఎం కేసీఆర్ ఇచ్చిన మాటను వంద శాతం నిలబెట్టుకొంటారు. సీఎంపై దళిత సమాజం నమ్మకం ఉంచాలి.