కొల్లాపూర్ : అప్పు ఇచ్చి తమ భూమిని అక్రమంగా స్వాధీనం చేసుకునేందుకు యత్నిస్తున్నారంటూ నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ ఆర్డీవో కార్యాలయం ఎదుట ఓ రైతు ఆత్మహత్యాయత్నానికి దిగడం సంచలనం కలిగించింది. వివరాల్లోకి వెళ్తే.. పెంట్లవెల్లి మండల కేంద్రంలో డాక్టర్ మల్లయ్య ఆర్ఎంపీగా పని చేస్తున్నాడు. కాగా, అదే గ్రామానికి చెందిన పలువురికి అప్పు ఇచ్చి తీర్చడం లేదని వారి భూమిని ఆక్రమించుకున్నాడని రైతులు ఆరోపించారు.
బింగి కృష్ణయ్య (4 ఏకరాలకు) రూ.60వేలు అప్పు, జటప్రోల్ కు చెందిన ఒరే బీరయ్య (2 ఎకరాలు) రూ.1.50లక్షలు అప్పు, గోప్లపూర్ కు చెందిన రంగారెడ్డికి (10 ఎకరాలు), రూ.20వేలు అప్పు కింద డాక్టర్ మల్లయ్య మొత్తం 16.10 ఏకరాల భూమిని అక్రమంగా బదలాయించుకున్నాడన్నారు.
వడ్డీ అసలు డబ్బులు చెల్లించినప్పటికి అక్రమంగా తమపై కోర్టులో కేసు పెట్టి మానసికంగా తమను ఇబ్బందులకు గురిచేస్తున్నాడని, తమకు న్యాయం చెయ్యాలని కోరుతూ మంగళవారం ఆర్డీవో హన్మానాయక్ కు వినతి పత్రం ఆందజేశారు. ఈ క్రమంలో బాధితుడు బింగి కృష్ణయ్య అకస్మాత్తుగా క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దీనిపై విచారణ చేసి న్యాయం చేస్తామని బాధితులకు ఆర్డీవో హనుమానాయక్ హామీ ఇచ్చారు.