లక్ష నుంచి 62 వేల క్యూసెక్కులకు..
ఆరు గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల
ఆత్మకూరు, జూలై 21 : జూరాల ప్రాజెక్టుకు వరద తగ్గుముఖం పట్టింది. రెండ్రోజులుగా లక్ష క్యూసెక్కులకు తగ్గకుండా వచ్చిన ఇన్ఫ్లో బుధవారం ఒక్కసారిగా తగ్గింది. మంగళవారం రాత్రి జూరాల డ్యాం 13 గేట్లతో లక్ష క్యూసెక్కులు దిగువకు విడుదల చేయగా.. బుధవారం ఉదయానికి తగ్గుతూ రాగా గేట్లను మూసేస్తూ వచ్చారు. కేవలం రెండు గేట్లను మాత్రమే ఎత్తారు. రా త్రి 9 గంటలకు 62,400 క్యూసెక్కుల ఇన్ఫ్లో రాగా, ఆరు గేట్లు ఎత్తి 35,837 క్యూసెక్కులు విడుదల చేశా రు. నెట్టెంపాడు ఎత్తిపోతలకు 750, ఎడమ కాలువకు 730, కుడి కాలువకు 328, సమాంతర కాలువకు 150, కోయిల్సాగర్ ఎత్తిపోతలకు 315 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. 31,852 క్యూసెక్కులతో ఎగువ, దిగువ జూరాల జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి కొనసాగుతున్నది. దిగువకు 70,021 క్యూసెక్కులు వి డుదలవుతున్నది. డ్యాం పూర్తిస్థాయి నీటిమట్టం 9.657 టీఎంసీలు కాగా 6.640 టీఎంసీలు నిల్వ ఉన్నాయి.
టీబీ డ్యాంకు వరద..
అయిజ, జూలై 21 : కర్ణాటకలోని తుంగభద్ర జలాశయానికి వరద కొనసాగుతున్నది. బుధవారం ఇన్ఫ్లో 50,558, అవుట్ఫ్లో 4,011 క్యూసెక్కులుగా నమోదైంది. జలాశయంలో ప్రస్తుతం 1620.29 అడుగుల వద్ద 59.011 టీఎంసీలు నిల్వ ఉన్నది.
ఆర్డీఎస్ ఆనకట్టకు..
ఆర్డీఎస్ ఆనకట్టకు 1,250 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుండగా కన్స్ట్రక్షన్ స్లూయిస్, స్కవర్ స్లూయిస్ గేట్ల ద్వారా దిగువన ఉన్న సుంకేసుల బ్యారేజీకి 1,560 క్యూసెక్కులు చేరుతున్నట్లు జేఈ శ్రీనివాస్ తెలిపారు. ప్రస్తుతం ఆనకట్టలో నీటినిల్వ 8.5 అడుగులు ఉండగా, ఆనకట్టపై దిగువకు అర అడుగు మేర ప్రవాహం ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు.
శ్రీశైలానికి కొనసాగుతున్న వరద
శ్రీశైలం, జూలై 21 : జూరాల ప్రాజెక్ట్ గేట్ల ద్వారా 35,837 , విద్యుదుత్పత్తి ద్వారా 31,852, సుంకేసుల నుంచి 2,215 క్యూసెక్కులు మొత్తం 69,904 క్యూసెక్కులు విడుదల చేశారు. కాగా, బుధవారం రాత్రి 9 గంటలకు 1,11,551 క్యూసెక్కుల నీరు శ్రీశైలం జలాశయానికి చేరినట్లు అధికారులు తెలిపారు. రిజర్వాయర్లో ప్రస్తుతం 844.20 అడుగుల వద్ద 68.7145 టీఎంసీల నిల్వ ఉన్నది. ఎడమ గట్టు భూగర్భ జలవిద్యుత్ కేంద్రం నుంచి విద్యుదుత్పత్తి కోసం 28,252 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.