హైదరాబాద్, జూలై 12 (నమస్తే తెలంగాణ): కృష్ణా జలాల పంపిణీలో అన్యాయం జరిగితే ఎట్టిపరిస్థితిలోనూ ఊరుకోబోమని, న్యాయమైన వాటా దక్కేవరకు పోరాడుతామని ఆర్థికమంత్రి హరీశ్రావు తెలిపారు. అంతర్రాష్ట్ర జలవివాదాల చట్టంలోని సెక్షన్ 3 ప్రకారం ఒకఏడాదిలో ఈ సమస్యను పరిష్కరించాల్సిన కేంద్రం ఏడేండ్లుగా నాన్చుతు న్నదని మండిపడ్డారు. తెలంగాణ వికాస సమితి ఆధ్వర్యంలో ‘వర్తమాన రాజకీయ పరిస్థితులు- కర్తవ్యాలు’ అనే అంశంపై దేశపతి శ్రీనివాస్ అధ్యక్షతన హైదరాబాద్లోని మినిస్టర్స్ క్వార్టర్స్లో సోమవారం నిర్వహించిన సదస్సుకు మంత్రి హరీశ్రావు ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత నెలరోజుల్లోనే కృష్ణా జలాల పంపిణీలో తెలంగాణ వాటా కోసం కేంద్రానికి విన్నవించామని గుర్తుచేశారు.
కేంద్రం పట్టించుకోకపోవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించామని వివరించారు. కృష్ణా జలాల పంపిణీని పూర్తిచేస్తామని కేంద్రం హామీ ఇవ్వడంతోపాటు, షరతులు విధించటంవల్లనే సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ను ఉపసంహరించుకోవాల్సి వచ్చిందని వెల్లడించారు. పిటిషన్ను వెనక్కి తీసుకున్నా సమస్యకు కేంద్రం పరిష్కారం చూపడంలేదని విమర్శించారు. సంవత్సర కాలానికి మాత్రమే చేసుకున్న నీటి ఒప్పందాన్ని ఏపీ సీఎం జగన్ తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తెలంగాణకు న్యాయం చేయాలని డిమాండ్చేశారు. రాష్ట్రంలోని రాజకీయ పరిణామాలను మేధావులు ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని సూచించారు. రాబోయే ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్కు మద్దతు ఇవ్వాలని తెలంగాణ వికాస సమితి ప్రతినిధులను మంత్రి హరీశ్ కోరారు.
బీజేపీవి ప్రజావ్యతిరేక విధానాలు:వినోద్
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నదని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ విమర్శించారు. ‘వర్తమాన రాజకీయ పరిస్థితులు- కర్తవ్యాలు’ సదస్సు కు హాజరైన ఆయన మాట్లాడుతూ పెట్రోల్, డీజిల్ ధరలను కేంద్రం విపరీతంగా పెంచిందని దుయ్యబట్టారు. ఈ సందర్భంగా తెలంగాణ వికాస సమితి నేతలు టీఆర్ఎస్కు పలు సూచనలు చేశారు. సదస్సులో వికాస సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎర్రోజు శ్రీనివాస్, సమన్వయకర్త ఒంటెద్దు నర్సింహారెడ్డి, ఉపాధ్యక్షుడు జీ వెంకటేశ్వర్లు, ఏ జయంతి, పులి రాజు, విజయానంద్, పిండిగ వెంకన్న, తెలంగాణ రిటైర్డ్ ఇంజినీర్స్ ఫోరం చైర్మన్ వెంకటేశం, తెలంగాణ పారిశ్రామిక వేత్తల సంఘం అధ్యక్షుడు సుధీర్రెడ్డి, కార్యదర్శి గోపాల్రావు తదితరులు పాల్గొన్నారు.