ఎదులాపురం,జూలై 10 : జిల్లా పోలీసుల ఆరోగ్య సంక్షేమానికి ప్రాధాన్యం కల్పించడంలో భాగంగా నిర్వహిస్తున్న ఉచిత కంటి వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆదిలాబాద్ ఇన్చార్జి ఎస్పీ ఎం.రాజేశ్చంద్ర పేర్కొన్నారు. స్థానిక ఏఆర్ హెడ్క్వార్టర్లో శనివారం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కంటి వైద్యశిబిరాన్ని ఏఎస్పీ హర్షవర్థన్ శ్రీవాస్తవ్తో కలిసి ప్రారంభించారు. డిజిటల్ కంప్యూటరైజ్డ్ యంత్రంలో స్వయంగా కంటి పరీక్షలు చేయించుకున్నారు. ఇన్చార్జి ఎస్పీకి ఎలాంటి సమస్యలు లేవని నిర్ధారించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విధి ని ర్వహణ సమయంలో పోలీసులు ఆరోగ్యంగా, మనశ్శాంతితో విధులు నిర్వహించినప్పుడే సమర్థంగా పనిచేస్తారని తెలిపారు డీజీపీ మహేందర్ రెడ్డి సౌజన్యంతో వరంగల్ జిల్లాకు చెందిన శరత్ మ్యాక్స్ విజన్సూపర్ స్పెషాలిటీ కంటి దవాఖాన బృందం తో రెండు రోజులపాటు పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు. మొద టి రోజు 462 మందికి కంటి పరీక్షలు చేయగా, 18 మందికి శస్త్ర చికిత్సలు అవసరం ఉందని వైద్యులు సూచించనట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీలు ఎస్. శ్రీనివాసరావు, సీ సమయ్జాన్రావు, డీఎస్పీ వెంకటేశ్వరరావు, రిజర్వ్ సీఐ సుధాకర్రావు, అడిగొప్పులు వేణు, పోలీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పెంచల వెంకటేశ్వర్లు, యూనిట్ సీఆర్ గంగారాం, మ్యాక్స్ విజన్ క్యాంప్ కో ఆర్డినేటర్ యోగేశ్, డాక్టర్ ఎస్.అశోక్, క్యాంపు కౌన్సిలర్ ఎస్.అనిత, తదితరులు పాల్గొన్నారు.