న్యూఢిల్లీ, జూలై 6: కరోనా నిబంధనలను విస్మరించి ప్రజలు పెద్దఎత్తున పర్వతప్రాంతాలకు పర్యటనకు వెళ్లడం, మార్కెట్లకు పోటెత్తడంపై కేంద్ర ఆరోగ్య శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. కరోనా మహమ్మారి ముగిసిపోలేదని హెచ్చరించింది. మనాలీ, సిమ్లా, ముస్సోరి తదితర పర్వత ప్రాంతాల్లో పర్యటనకు ప్రజలు భారీగా చేరుకోవడం, ఢిల్లీలోని సదర్ బజార్, ముంబైలోని దాదర్ మార్కెట్లో ప్రజలు కిక్కిరిసిపోయిన ఫొటోలు, వీడియోలను మీడియాలో చూస్తుంటే కలవరం కలుగుతున్నదని ఆ శాఖ అధికారులు పేర్కొన్నారు. భౌతికదూరం పాటించకుండా, మాస్కులు ధరించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కరోనా కట్టడికి ఇప్పటి వరకు జరిగిన కృషి బూడిదలో పోసిన పన్నీరవుతుందని వారు హెచ్చరించారు.