జైపూర్: రాజస్థాన్లోని బికనేర్లో ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న ఓ భవనం కుప్పకూలడంతో ముగ్గురు కార్మికులు మృతిచెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. బికనేర్లోని గంగా సిటీలో కొత్తగా భవనాన్ని నిర్మిస్తున్నారు. అందులో మొత్తం ఎనిమిది మంది పనిచేస్తున్నారు. ఈక్రమంలో భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో ముగ్గురు మరణించగా, మరో ఐదుగురు శిథిలాల్లో చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు ప్రారంభించి బాధితులను కాపాడారు. గాయపడిన వారిని దవాఖానకు తరలించారు. మృతుల కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధికింద పరిహారం అందిస్తామని బికనేర్ జిల్లా కలెక్టరు నమిత్ మెహతా చెప్పారు. కాగా, ఈఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.