హైదరాబాద్, జూన్15 (నమస్తే తెలంగాణ): గ్రీన్ ఇండియా చాలెంజ్లో మరో కీలక ఘట్టం. దేశవ్యాప్తంగా ప్రకృతి పరిరక్షణ కోసం రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ ఉద్యమంలా చేపడుతున్న గ్రీన్ చాలెంజ్లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పాల్గొన్నారు. మంగళవారం రాజ్భవన్లో మామిడి మొక్క నాటారు. దేశవ్యాప్తంగా పచ్చని ప్రకృతి సంపదను సృష్టించడానికి సరైన సమయంలో గ్రీన్చాలెంజ్ కార్యక్రమాన్ని చేపట్టిన ఎంపీ సంతోష్కుమార్ను సీజేఐ ఎన్వీ రమణ అభినందించారు. గ్రీన్ చాలెంజ్ కార్యక్రమం అద్భుతమని ప్రశంసించారు. సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు, రిటైర్డ్ జడ్జీలు, జ్యుడిషియల్ అధికారులు గ్రీన్ చాలెంజ్లో పాల్గొని మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. తల్లిలా మనకు నీడనిచ్చి రక్షణకల్పించే చెట్లను పెంచడం ప్రతిపౌరుని ధర్మమని చెప్పారు. పర్యావరణాన్ని పరిరక్షించి భవిష్యత్తు తరాలకు మంచి వాతావరణాన్ని అందించడానికి పాటుపడాలని ఎన్వీ రమణ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సీజేఐ ఎన్వీ రమణకు ఎంపీ సంతోష్కుమార్ వృక్షవేదం పుస్తకాన్ని బహూకరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ నవీన్కుమార్, రాజ్భవన్ అధికారులు పాల్గొన్నారు.
ఉత్తరప్రదేశ్ మచిలీషహర్ ఎంపీ భోలానాథ్ సరోజ్ గ్రీన్ ఇండియా చాలెంజ్లో పాల్గొన్నారు. మంగళవారం న్యూఢిల్లీలోని నార్త్ ఎవెన్యూలోని తన నివాసంలో ఆయన మొక్కలు నాటారు. పర్యావరణాన్ని పరిరక్షించడానికి టీఆర్ఎస్ నాయకుడు, ఎంపీ సంతోష్కుమార్ చేపట్టిన గ్రీన్ చాలెంజ్ కార్యక్రమం బృహత్తరమైనదని అభినందించారు.