కంటోన్మెంట్, జూన్ 13: రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ సంఘం సేవా సమితి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం హర్షనీయమని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. ఈ మేరకు ఆదివారం కంటోన్మెంట్ రసూల్పురాలోని కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ సంఘం కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని రాజ్యసభ సభ్యులు బండ ప్రకాశ్ ముదిరాజ్, టీఆర్ఎస్ పార్టీ మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జ్ మర్రి రాజశేఖర్రెడ్డి, బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్రెడ్డిలతో కలిసి రక్తదాన శిబిరాన్ని మంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ ముదిరాజ్ సంఘం సేవా సమితి నేతృత్వంలో మంచి కార్యక్రమానికి పూనుకోవడం శుభపరిణామని అన్నారు. బీసీ కులాలను ఐక్యం చేసి, ఓకే తాటిపై నడిపిన వ్యక్తి కొరివి కృష్ణస్వామి అని గుర్తు చేశారు. అనంతరం, రాజ్యసభ సభ్యుడు ప్రకాశ్ ముదిరాజ్ మాట్లాడుతూ 33 జిల్లా కేంద్రాల్లో రక్తదాన శిబిరాలు నెలకొల్పడం చిన్న విషయం కాదన్నారు.
ముదిరాజ్ సేవా సమితి రానున్న రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టి ముందుకుసాగాలని ఆకాంక్షించారు. కొరివి కృష్ణస్వామి విగ్రహాన్ని త్వరలోనే జేబీఎస్ వద్ద ఆవిష్కరించనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో రాష్ట్ర ముదిరాజ్ సంఘం సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు పిట్ల నగేష్ ముదిరాజ్, బోర్డు మాజీ సభ్యుడు సదా కేశవరెడ్డి, సంఘం నేతలు యాదగిరి, అంజనేయులు, వేణుగోపాల్, సత్యనారాయణ, పిట్ల కృష్ణ, కనకయ్య, రాజేందర్, భాస్కర్, శ్యామ్, గౌరీ శంకర్, శ్రీను, బాల్రాజ్ పాల్గొన్నారు.