న్యూఢిల్లీ, జూన్ 7: కరోనా కట్టడిలో భాగంగా తీసుకొచ్చిన వ్యాక్సినేషన్ విధానంలో ఉన్న లోటుపాట్లపై రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రతిపక్షాలతో పాటు సుప్రీంకోర్టు సైతం అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో కేంద్రప్రభుత్వం ఎట్టకేలకు దిగొచ్చింది. 18 ఏండ్లు పైబడిన వారికి కేంద్రమే ఉచితంగా టీకా పంపిణీ చేయనున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఉత్పత్తి సంస్థల నుంచి స్వయంగా టీకాలు కొనుగోలు చేసి రాష్ర్టాలకు ఇస్తామని తెలిపారు. టీకాల కోసం రాష్ర్టాలు రూపాయి కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేదన్నది. ఈ మేరకు సోమవారం చేసిన ప్రసంగంలో వ్యాక్సినేషన్పై మాట్లాడారు. వ్యాక్సిన్ ఉత్పత్తి సంస్థల నుంచి 75 శాతం టీకాలను కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని తెలిపారు. ఇకపై రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాక్సిన్లను సేకరించాల్సిన పనిలేదన్నారు. మిగతా 25 శాతం టీకాలు ప్రైవేటు రంగానికి అందుబాటులో ఉంటాయన్నారు. సొంత ఖర్చుతో టీకా వేయించుకోవాలనుకున్నవారు.. రూ.150 సర్వీస్ ఛార్జితో ప్రైవేటు దవాఖానల్లోనూ వ్యాక్సిన్ వేసుకోవచ్చని పేర్కొన్నారు.
కాగా, వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా.. తొలుత 45 ఏండ్లు నిండినవారికి మాత్రమే కేంద్రం ఉచితంగా టీకా వేస్తామని ప్రకటించింది. 18-44 ఏండ్ల మధ్యవారు రాష్ట్రప్రభుత్వాలు ఏర్పాటు చేసే టీకా కేంద్రాల్లో, ప్రైవేట్ దవాఖానల్లో టీకా వేసుకోవచ్చని వెల్లడించింది. దీని కోసం రాష్ర్టాలు, ప్రైవేట్ దవాఖానలు 50 శాతం టీకా డోసులను ఉత్పత్తి సంస్థల నుంచి సేకరించుకోవచ్చని వివరించింది. అయితే, రాష్ట్రప్రభుత్వాలకు నేరుగా టీకాలను విక్రయించబోమని ఉత్పత్తి సంస్థలు తేల్చిచెప్పడం, టీకాల సరఫరాలో కొరత కారణంగా పలు రాష్ర్టాల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమం అర్థాంతరంగా నిలిచిపోయింది. దీనిపై పలు రాష్ర్టాలు కేంద్రం వైఖరిని తప్పుబట్టాయి. అలాగే, వ్యాక్సిన్ డోసుల ధరల్లో వ్యత్యాసం ఉండటంపట్ల కూడా అసంతృప్తి వ్యక్తం చేశాయి. వ్యాక్సిన్ విధానంపై సుప్రీంకోర్టు సైతం కేంద్రంతీరును తప్పుబట్టింది. సర్వత్రా విమర్శలు వెల్లువెత్తడంతో మోదీ సర్కార్ నష్టనివారణ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే 18 ఏండ్లు పైబడిన వారికి ఉచితంగా వ్యాక్సిన్ వేస్తామని ప్రకటించింది.
వాళ్లు అడిగితేనే ఇచ్చాం!
టీకా డోసుల కొరత, ఉత్పత్తి సంస్థల నుంచి వ్యాక్సిన్ సేకరణలో ఇబ్బందులు తలెత్తడంతో కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్ విధానంపై పలు రాష్ట్రప్రభుత్వాలు, ప్రతిపక్షాలు మండిపడ్డ నేపథ్యంలో మోదీ వివరణ ఇచ్చారు. వ్యాక్సిన్ పంపిణీని వికేంద్రీకరించాలని రాష్ట్ర ప్రభుత్వాలు కోరడంతోనే 25 శాతం టీకా బాధ్యతను ఆయా రాష్ర్టాలకు అప్పగించామని చెప్పారు.
టీకా తయారీలో 7 కంపెనీలు
మహమ్మారి నుంచి ప్రజలను రక్షించేందుకు వ్యాక్సిన్ కవచంలాగా సాయపడుతుందని ప్రధాని వెల్లడించారు. రానున్న రోజుల్లో టీకాల ఉత్పత్తిని గణనీయంగా పెంచబోతున్నట్టు పేర్కొన్నారు. ‘దేశంలో 7 కంపెనీలు టీకాలు తయారు చేస్తున్నాయి. మరో మూడు కంపెనీలు క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్నాయి. చిన్నారుల కోసం రెండు టీకాలు సిద్ధమవుతున్నట్టు పేర్కొన్నారు. నాజల్ స్ప్రే టీకా కోసం కూడా ప్రయోగాలు పెద్దఎత్తున జరుగుతున్నాయి. ఇవి సఫలమైతే కొవిడ్ వ్యాక్సినేషన్ మరింత వేగవంతమవుతుంది’ అని మోదీ పేర్కొన్నారు. మరోవైపు, కరోనా సంక్షోభం నేపథ్యంలో దీపావళి వరకు పీఎం గరీబ్ కళ్యాణ్ అన్నదాన యోజన పథకం కొనసాగుతుందని మోదీ తెలిపారు. ఈ పథకం ద్వారా నెలకు ఒక్కో వ్యక్తికి 5 కిలోల బియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేస్తామని, దీంతో 80 కోట్ల మందికి లబ్ధి చేకూరనున్నట్టు వెల్లడించారు.
ఎప్పుడో నిర్ణయం తీసుకోవాల్సింది
ఈ నిర్ణయాన్ని కేంద్రం ఎప్పుడో తీసుకోవాల్సింది. ఆలస్యం కారణంగా ఎంతోమంది మరణించారు.
-పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ
అనవసరపు నిందలు
వ్యాక్సిన్ సంస్థల నుంచి టీకాలను నేరుగా సేకరిస్తామని ఏ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని డిమాండ్ చేసింది? ప్రధాని అనవసరంగా రాష్ర్టాలపై నిందలు వేస్తున్నారు.
-పీ చిదంబరం, కాంగ్రెస్ సీనియర్ నేత
కష్ట సమయంలో సరైన నిర్ణయం
కేంద్రం కష్ట సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నది. మా విజ్ఞప్తిని ప్రధాని అంగీకరించినందుకు సంతోషంగా ఉన్నది.
-విజయన్, కేరళ సీఎం
వాళ్లకెందుకు ఇవ్వడం?
టీకా ఉచితం అన్నప్పుడు ప్రైవేట్ దవాఖానలకు 25 శాతం టీకాలు ఎందుకు? వాటికి ఛార్జీలు ఎందుకు
-రాహుల్గాంధీ, కాంగ్రెస్ నేత
ప్రజలందరికీ టీకాలు వేయడానికి కేంద్రం చేయగలిగినదంతా చేస్తున్నది. కరోనాపై పోరులాగే, వ్యాక్సినేషన్ కూడా సమిష్టి బాధ్యత. ప్రజలు కూడా స్వతహాగా ముందుకొచ్చి టీకాలు వేసుకోవాలి.
-మే 21న చేసిన ప్రసంగంలో ప్రధాని మోదీ
18 ఏండ్లు పైబడిన వారికి కేంద్రమే ఉచితంగా టీకా పంపిణీ చేస్తుంది. ఉత్పత్తి సంస్థల నుంచి స్వయంగా టీకాలు కొనుగోలు చేసి రాష్ర్టాలకు ఇస్తాం. టీకాల కోసం రాష్ర్టాలు రూపాయి కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. వ్యాక్సినేషన్ బాధ్యతంతా మాదే.