మెట్పల్లి: పల్లె ప్రగతి ద్వారా గ్రామాలు అద్భుతంగా తయారయ్యాయని, పట్టణ ప్రగతి ద్వారా పట్టణాలను కూడా అద్భుతంగా తీర్చిదిద్దుతున్నామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. కొత్త మున్సిపల్ చట్టాన్ని కఠినంగా అమలు చేస్తున్నామని చెప్పారు. జగిత్యాల జిల్లాలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన అనంతరం కేటీఆర్ మీడియా సమావేశంలో మాట్లాడారు.
‘మెట్పల్లిలో రూ. 2.50కోట్లతో వెజ్, నాన్వెజ్ మార్కెట్ నిర్మిస్తున్నాం. కరోనా వల్ల ఆర్థిక సంక్షోభం తలెత్తింది. రూ.500 కోట్లతో అన్ని మున్సిపాలిటీల్లో వెజ్, నాన్వెజ్ మార్కెట్లు ఏర్పాటు చేస్తున్నాం. 138 మున్సిపాలిటీల్లో రూ.500 కోట్లు మార్కెట్ల కోసమే ఖర్చు చేస్తున్నాం. తెలంగాణ ఏర్పాటుకు ముందు 68 మున్సిపాలిటీలు ఉండేవి. రాష్ట్రం ఏర్పడిన తర్వాత మున్సిపాలిటీల సంఖ్య 142కు చేరింది. మౌలిక వసతులపైనా ప్రభుత్వం దృష్టిసారించింది. స్మశానవాటికల నిర్మాణానికి రూ.200 కోట్లు కేటాయించాం. మొదటి దశలో 71 మానవ వ్యర్థాల శుద్ధీకరణ ప్లాంట్లు కడుతున్నాం. మానవ వ్యర్థాల శుద్ధీకరణ ప్లాంట్లకు రూ.325 కోట్లు కేటాయిస్తున్నాం. మున్సిపాలిటీలకు ప్రతినెలా రూ.148 కోట్లు విడుదల చేస్తున్నామని’ కేటీఆర్ పేర్కొన్నారు.