సుల్తాన్బజార్, మే 18: హైదరాబాద్ కోఠిలోని ప్రభుత్వ ఈఎన్టీ దవాఖానకు బ్లాక్ ఫంగస్ బాధితుల తాకిడి పెరుగుతున్నది. దీంతో వారికి చికిత్స అందించేందుకు 50 పడకలతో ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశారు. ఈ వార్డులో ఇప్పటికే ఇద్దరు బ్లాక్ ఫంగస్ బాధితులకు విజయవంతంగా శస్త్రచికిత్సలు నిర్వహించారు. మరో 38 మంది ఇన్ పేషెంట్లుగా చికిత్స పొందుతున్నారు. వీరిలో ముగ్గురు మహిళలు సహా 14 మంది మంగళవారం చేరినవారే ఉండటం గమనార్హం. కొవిడ్ నుంచి కోలుకొని బ్లాక్ ఫంగస్ బారిన పడినవారికి మాత్రమే ఇక్కడ చికిత్స అందిస్తున్నట్టు దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ తాటి శంకర్ తెలిపారు. కరోనా నుంచి కొలుకున్నవారికే బ్లాక్ ఫంగస్ వేగంగా వ్యాప్తి చెందుతున్నదని, దీన్ని తొలి దశలోనే కట్టడి చేసేందుకు అవసరమైతే ప్రత్యేక వార్డులో పడకలను 100కు పెంచుతామని వివరించారు. ఇదే సమయంలో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో దవాఖానకు వచ్చేవారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని డాక్టర్ శంకర్ స్పష్టం చేశారు.