న్యూఢిల్లీ : పెరుగుతున్న కొవిడ్-19 కేసులను దృష్టిలో పెట్టుకొని దేశవ్యాప్తంగా ఉచిత మాస్ టీకా డ్రైవ్ ప్రారంభించాలని 13 ప్రతిపక్ష పార్టీల నేతలు కేంద్రాన్ని కోరారు. అలాగే కేసుల దృష్ట్యా ఆసుపత్రులు, ఆరోగ్య కేంద్రాలకు నిరంతరాయంగా ఆక్సిజన్ సరఫరా ఉండేలా చూడాలని ఉమ్మడి ప్రకటనలో సూచించారు. టీకా కార్యక్రమం కోసం బడ్జెట్లో కేటాయించిన రూ.35వేల డ్రైవ్కు తప్పనిసరిగా వినియోగించాలన్నారు. సంయుక్త ప్రకటనపై సంతకం చేసిన వారిలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, జేడీఎస్ నేత హెచ్డీ దేవేగౌడ, ఎన్సీపీ నేత శరద్ పవార్, శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే, టీఎంసీ అధినేత మమత బెనర్జీ, జేఎంఎం నేత, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్, బీఎస్పీ అధినేత మాయావతి, నేషనల్ కాన్ఫరెన్స్ ఫరూక్ అబ్దుల్లా, సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, వామపక్ష నేతలు డీ రాజా, సీతారాం ఏచూరి ఉన్నారు. అయితే, సంయుక్త ప్రకటనను ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా పరిశీలిస్తారని కాంగ్రెస్ నేత జైరామ్ రమేశ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ‘ఉమ్మడి ప్రకటనను ప్రధాని తీవ్రంగా, సరైన స్ఫూర్తితో పరిశీలిస్తారని ఆశిస్తున్నాను. జాతీయ సంక్షోభ సమయంలో విశ్వాసం పెంచేందుకు వారిని కలువడం ముందడుగవుతుంది’ అని ట్వీట్ చేశారు.