సెకండ్ వేవ్లో కరోనా ప్రభావం ఎక్కువే..
వైద్యులను సంప్రదించాలి
ఇండ్ల నుంచి బయటకు రానివ్వద్దు
మాస్కులు బిగువుగా ధరించవద్దు
అతిగా శానిటైజర్లు వినియోగించవద్దు
తేలికగా జీర్ణమయ్యే ఆహారం ఇవ్వాలి..
‘నమస్తే’తో పిల్లల వైద్యనిపుణుడు డాక్టర్ శివ
ఎదులాపురం, మే 2 : తొలిదశతో పొలిస్తే సెకండ్వేవ్లో కరోనా ప్రభావం పిల్లలపై ఎక్కువగా ఉన్నది. లక్షణాలు కనిపించిన వెంటనే తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దని ఆదిలాబాద్కు చెందిన ప్రముఖ పిల్లల వైద్య నిపుణుడు డాక్టర్ శివ సూచిస్తున్నారు. సకాలంలో వైద్యులను సంప్రదించి వారి సూచనల మేరకు చికిత్స చేయించాలని పేర్కొన్నారు. చిన్నారుల్లో కొవిడ్ లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అందించాల్సిన చికిత్స వివరాలను ఆదివారం ‘నమస్తే తెలంగాణ’తో పంచుకున్నారు.
పిల్లల్లో ప్రధానంగా కనిపించే లక్షణాలు..
పెద్దవాళ్లతో పోల్చిచూసినపుడు పిల్లల్లో కరోనా లక్షణాలు కాస్త భిన్నంగా ఉంటున్నాయి. తీవ్రమైన జ్వరంతో పాటు జలుబు, పొడిదగ్గు, వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి, కండ్లు ఎర్రబడడం, చర్మం మీద ఎర్రని దద్దుర్లు కనిపిస్తున్నాయి. అయితే గొంతునొప్పి అంతగా ఉండడం లేదు. అయితే పిల్లల్లో వ్యాధి తీవ్రత తక్కువగా ఉండడం సానుకూలంశం.
ఎమ్ఐఎస్- సీ అంటే ఏమిటి?ఎలా గుర్తించాలి? చికిత్స వివరాలేంటి..
పిల్లల్లో అతి భయకరమైనది ఎమ్ఐఎస్-సీ లక్షణాలు. మూడురోజుల కంటే ఎక్కువగా తీవ్రమైన జ్వరం, వాంతులు, అతిసాక, తీవ్రమైన కడుపునొప్పి, బాగా నీరసంగా కనిపించడం, కాళ్లు, చేతుల్లో వాపులు, కండ్లు ఎర్రబడడం. ఈ లక్షణాలు కనిపించిన వెంటనే పిల్లలను వైద్యశాలలో చేర్పించాలి, ఐసీయూలో చేర్చి చికిత్స చేస్తే ప్రాణాలను కాపాడవచ్చు.
తల్లికి పాజిటివ్ వచ్చినా శిశువుకు పాలు ఇవ్వవచ్చు..
తల్లికి కరోనా నిర్ధారణ జరిగి శిశువుకు నెగెటివ్ వచ్చినా నిరభ్యంతరంగా పాలు ఇవ్వవచ్చు, ఈ విషయంలో అనేక అపోహలు ఉన్నాయి. పాలతో వైరస్ వ్యాప్తి చెందుతుందనేది అవాస్తవం, తల్లి కనీస జాగ్రత్తలు పాటించాలి. పాలిచ్చేటపుడు తప్పనిసరిగా మాస్క్ ధరించాలి. చేతులను శుభ్రం చేసుకోవాలి. తల్లికి నెగెటివ్, బిడ్డకు పాజిటివ్ వచ్చిన సందర్భాల్లో బిడ్డను తల్లికి దూరంగా ఉంచాలి. వైద్యుల సలహామేరకు మందులను అందించాలి.
అతిగా శానిటైజర్లు వాడవద్దు..
కరోనా వచ్చిన పిల్లల విషయంలో తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అతిగా శానిటైజర్ వాడకుండా చూడాలి. బిగ్గరగా ఉన్న మాస్క్లు ధరించవద్దు. పాజిటివ్ పిల్లలను బయటకు పంపవద్దు. ఇండ్లల్లోనే నిరంతరం పర్యవేక్షించాలి.
ఎలాంటి ఆహారం తీసుకోవాలి..
వ్యాధిబారిన పడ్డ చిన్నారులకు తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని ఇవ్వాలి. పుచ్చకాయ, కీర, దోసకాయ లాంటి తాజా పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు ఎక్కువగా తినిపించాలి. ఆహారంలో ప్రోటీన్లు సమృద్ధిగా ఉండే చిరుధాన్యాలను అందించాలి. మాంసాహారానికి దూరంగా ఉంచడం మంచిది. పండ్లరసాలు, కొబ్బరిపాలను తాగించాలి. వేసవిలో దొరికే మామిడి, జామ, తాటి ముంజలు తినిపిస్తే వ్యాధి నిరోధకశక్తి పెంపొందుతుంది. కాల్షియం, ప్రోటీన్లు విరివిగా ఉండే పాలు, పెరుగు, పన్నీరు లాంటి పదార్థాలను ఇవ్వాలి. తరచూ రాగి జావ తాగించాలి.
వ్యాయామం, యోగా చేయించాలి..
వ్యాధి నిర్ధారణ అయిన పిల్లలతో నిత్యం వ్యాయామం, యోగా చేయించాలి. ఉదయాన్నే సురక్షిత ప్రాంతాలకు వాకింగ్కు తీసుకెళ్లాలి. బయటకు వెళ్లినప్పుడు మాస్క్ ధరింపజేయాలి.
గర్భిణులు, బాలింతలు వ్యాక్సిన్ తీసుకోవద్దు..
గర్భిణులు, బాలింతలు, పిల్లలు వ్యాక్సిన్ తీసుకోవద్దు. ఇప్పటి వరకు వీరిపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించలేదు. ఒకవేళ తీసుకుంటే దుష్ప్రభావాలు తలెత్తే అవకాశం ఉంటుంది. 18 సంవత్సరాలు పైబడిన వారందరూ నిశ్చింతగా టీకా తీసుకోవచ్చు. బీపీ, షుగర్, థైరాయిడ్లాంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు నిరభ్యంతరంగా వ్యాక్సిన్ వేయించుకోవచ్చు. ఈ విషయంలో వదంతులను నమ్మవద్దు.