కాంగ్రెస్, ఇతర పార్టీలవి అబద్ధపు ప్రచారాలు
టీఆర్ఎస్ హయాంలోనే అభివృద్ధి
మంత్రులు మహమూద్ అలీ,
పువ్వాడ అజయ్ కుమార్
నగరంలో రోడ్షో, సమావేశాలు
ఖమ్మం/ ఖమ్మం సిటీ/ మామిళ్లగూడెం/ ఖమ్మం వ్యవసాయం, ఏప్రిల్ 24: ఖమ్మం నగర అభివృద్ధి టీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమవుతుందని రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ స్పష్టం చేశారు. ఖమ్మం నగరపాలక సంస్థ ఎన్నికల సందర్భంగా శనివారం నగరంలోని 19, 21, 23, 24 డివిజన్లలో రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావులతో కలిసి రోడ్షోలో ఆయన మాట్లాడారు. ఖమ్మం పురపాలకంగా ఉన్న సమయంలో ఎక్కువ కాలం పాలన కొనసాగించిన కాంగ్రెస్, సీపీఎం పార్టీలు నగర అభివృద్ధికి చేసిందేమీ లేదని విమర్శించారు. నగర పాలక సంస్థగా ఏర్పడిన తరువాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం, ఖమ్మం నగరంలో టీఆర్ఎస్ అధికార పక్షంలోకి రావడంతో గడిచిన ఐదేళ్లుగా నగరంలో అభివృద్ధి పరుగులు పెడుతోందని స్పష్టం చేశారు. రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సహకారంతో ఖమ్మం నగరం అభివృద్ధిలో కొత్త పుంతలు తొక్కుతున్నదన్నారు. అభివృద్ధి వెలుగులను చూసిన కాంగ్రెస్, ఇతర పార్టీల నాయకులు బిత్తరపోయి సోయిలేని మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. వారు చేస్తున్న గోబెల్స్ ప్రచారాలను నమ్మొద్దని నగర ప్రజలకు సూచించారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ మాట్లాడుతూ అభివృద్ధిని కాంక్షించేది టీఆర్ఎస్ మాత్రమేనని అన్నారు.
కేఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులను, టీఆర్ఎస్ మద్దతు ఇస్తున్న సీపీఐ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ అభివృద్ధిసంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే మొదటి స్థానంలో ఉందని అన్నారు. అనంతరం టీఆర్ఎస్ బలపర్చిన 19వ డివిజన్ సీపీఐ అభ్యర్థి చామకూరి వెంకటేశ్వర్లు, సీపీఐ బలపర్చిన 21వ డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్థి ఆళ్ల నిరీషారెడ్డి, 23వ డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్థి షేక్ మగ్బూల్, 24వ డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్థి కమర్తపు మురళిలను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వారు పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు, టీఆర్ఎస్ నాయకులు బీరెడ్డి నాగచంద్రారెడ్డి, అమరగాని వెంకన్న, దాసరి నాగేశ్వరరావు, జశ్వంత్, బిక్కసాని ప్రశాంతలక్ష్మి, ఆళ్ల అంజిరెడ్డి, సీపీఐ నాయకులు జానిమియా పాల్గొన్నారు.
త్రీటౌన్ను సుందరంగా తీర్చిదిద్దాం..
నగరంలో ఒకనాడు మురుగుకూపాలుగా ఉన్న గోళ్లపాడు చానల్ ప్రాంతాలను, త్రీటౌన్ ప్రాంతాన్ని సుందరంగా తీర్చిదిద్దామని మంత్రి అజయ్కుమార్ అన్నారు. కేఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం సాయంత్రం 28, 29, 30, 34 డివిజన్ల టీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపును కాంక్షిస్తూ నిర్వహించిన రోడ్ షోలు, ప్రచారాల్లో ఆయన మాట్లాడారు. ఆయా డివిజన్ల టీఆర్ఎస్ అభ్యర్థులు గజ్జెల లక్ష్మి, పత్తిపాక లత, మొక్కల కమల, రుద్రగాని శ్రీదేవిలను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.
ఖిల్లాపై గులాబీ జెండా ఎగరాలి..
ఖమ్మం ఖిల్లాపై గులాబీ జెండా ఎగరాలని మంత్రులు మహమూద్ అలీ, పువ్వాడ అజయ్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా 39, 40 డివిజన్లలో టీఆర్ఎస్ అభ్యర్థులు మడూరి ప్రసాద్, దాదె అమృతమ్మలతో కలిసి విస్తృత ప్రచారం నిర్వహించారు.
43వ డివిజన్లో ప్రచారం..
కేఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ బలపరిచిన సీపీఐ అభ్యర్థి బీజీ క్లెమెంట్ గెలుపును కాంక్షిస్తూ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ 43వ డివిజన్లో రోడ్షో నిర్వహించారు. వైరా ఎమ్మెల్యే రాములునాయక్తో కలిసి విస్తృత ప్రచారం నిర్వహించారు. టీఆర్ఎస్ మద్దతుతో పోటీచేస్తున్న సీపీఐ అభ్యర్థి బీజీ క్లెమెంట్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
పనిచేసే ప్రభుత్వాన్ని ఆదరించండి..
నిరంతరం పేదల పక్షాన నిలబడి కష్టించి పనిచేసే ప్రభుతాన్ని ఆదరించాలని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు, వైరా ఎమ్మెల్యే రాములునాయక్ అన్నారు. 52వ డివిజన్లో సీపీఐ బలపరిచిన టీఆర్ఎస్ అభ్యర్థి బుర్రి వెంకటేశ్వర్లు విజయాన్ని కాంక్షిస్తూ శనివారం రాత్రి వారు ప్రచారం నిర్వహించారు. తొలుత డివిజన్లో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. మార్క్ఫెడ్ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.