బ్యాంకు ఖాతాల్లో రూ.2వేలు జమ
25కిలోల సన్నబియ్యం అందజేసిన ఎమ్మెల్యే మహేశ్రెడ్డి
పరిగి, ఏప్రిల్ 21 : కరోనా కష్టకాలంలో ప్రైవేటు టీచర్లకు సర్కారు అండగా నిలుస్తున్నదని ఎమ్మెల్యే మహేశ్రెడ్డి పేర్కొన్నారు. బుధవారం పరిగిలో ప్రైవేటు టీచర్లకు 25 కిలోల చొప్పున సన్న బియ్యాన్ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కరోనా సమయంలో ప్రైవేటు పాఠశాలల్లో పనిచేస్తున్న టీచర్లు, సిబ్బందికి వేతనాలు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న తరుణంలో సీఎం కేసీఆర్ స్పందించి ప్రైవేటు టీచర్లకు నెలకు రూ.2వేలు, 25 కిలోల సన్నబియ్యం ఇవ్వాలని నిర్ణయించారని చెప్పారు. ఈమేరకు ప్రైవేటు టీచర్ల బ్యాంకు ఖాతాలలో రూ.2వేలు జమ చేశారని, ప్రతి కుటుంబానికి 25 కిలోల సన్నబియ్యం పంపిణీకి చర్యలు చేపట్టిందన్నారు. గత సంవత్సరం నుంచి కరోనా కష్టకాలంలో ఇబ్బంది పడుతున్న వివిధ వర్గాల వారికి సర్కారు చేయూతనందిస్తున్నదని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్, ఎంఈవో హరిశ్చందర్, ఎంఆర్ఐ వెంకట్మ్రణారెడ్డి పాల్గొన్నారు.
తాండూరులో బియ్యం పంపిణీ ప్రారంభం
తాండూరు, ఏప్రిల్ 21 : తాండూరులో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మురళీకృష్ణగౌడ్, మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న, కౌన్సిలర్ శ్రీలత, ఆర్డీవో అశోక్కుమార్, ఎంఈవో వెంకటయ్యగౌడ్ కలిసి బియ్యం పంపిణీని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మురళీకృష్ణగౌడ్ మాట్లాడుతూ దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణలో ప్రైవేటు ఉపాధ్యాయులకు, సిబ్బందికి సాయం అందించడం చాలా గొప్ప విషయమన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాల టీచర్లు, సిబ్బందిని మానవీయ దృక్పథంతో ఆదుకోవడంతో ఎంతో మంది కుటుంబాలు బాగుపడుతున్నాయని తెలిపారు.