దమ్మపేట/దమ్మపేట రూరల్, ఏప్రిల్ 8: గిరిజనులు, కొండరెడ్లు, ఆదిమ తెగల అభ్యున్నతే ధ్యేయమని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. దమ్మపేట మండల పరిధిలోని పూసుకుంట పంచాయతీ కార్యాలయంలో గురువారం గవర్నర్ జాయింట్ సెక్రటరీ భవానీ శంకర్, సర్పంచ్ ఉమ్మల దుర్గ, జడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు, ఎంపీపీ సోయం ప్రసాద్, తహసీల్దార్ మస్తాన్రావు, ఎంపీడీవో రవితో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆమె మాట్లాడారు. ఆదిమ తెగల సంక్షేమం కోసం అధికారులు పనిచేయాలన్నారు. ప్రభుత్వ ఫలాలను ప్రజలకు అందజేయాలన్నారు. అంతరించిపోతున్న ఆదిమ గిరిజన తెగలను గుర్తించి, వారికి జీవన స్థితిగతులు మార్చేందుకు సర్వే చేపడుతున్నామన్నారు. రాష్ట్రంలో ఆరు గ్రామాల్లో మాత్రమే కొండరెడ్ల తెగ ఉందన్నారు.
వీరు జిల్లాలోని దమ్మపేట మండలంలోని పూసుకుంట, అశ్వారావుపేట మండలంలో ఐదు గ్రామాల్లో నివసిస్తున్నారన్నారు. వీరి ఆరోగ్య పరిస్థితులు, ఆర్థిక స్థితిగతులను అంచనా వేస్తూ సర్వే చేపట్టామన్నారు. కాన్ఫరెన్స్లో జడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. అటవీశాఖ అనుమతులు లేకపోవడంతో గ్రామానికి రహదారి సౌకర్యం రాలేదన్నారు. గ్రామంలో 37 కుటుంబాలకు డబుల్ బెడ్ రూం ఇళ్లు మంజూరు చేయించాలని కోరారు. సర్పంచ్ ఉమ్మల దుర్గ గవర్నర్ను పూసుకుంట గ్రామానికి ఆహ్వానించారు. దీనిపై స్పందించన గవర్నర్ తప్పకుండా పల్లెకు వస్తానని హామీ ఇచ్చారు. రహదారి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని, సమస్యలను ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. కాన్ఫరెన్స్లో గవర్నర్ వైద్యాధికారి ప్రత్యూష, సీడీపీవో, వైస్ ఎంపీపీ దారా మల్లికార్జునరావు, పశువైద్యాధికారి రమేష్బాబు, ఎంపీవో బత్తిన శ్రీనివాసరావు పాల్గొన్నారు.