మారుమూల. ఆదివాసీ, అడవుల జిల్లా ఆదిలాబాద్. ఉమ్మడి పాలనలో జిల్లావైపు కన్నెత్తి చూసిన పాలకుడు లేడు. కూతవేటు దూరంలోని గూడేలకు చేరాలన్నా.. కిలోమీటర్ల దూరంలోని జిల్లాకేంద్రాలకు చేరాలన్నా నిన్నటిదాకా డొంకదారులే దిక్కు. నడకదారుల్లో నరకయాతనలే. 10 కిలోమీటర్ల దూరం కూడా లేని సుంకిడి గ్రామం నుంచి ఆదిలాబాద్కు రావాలంటే పూట పట్టేది. 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న బేల నుంచి కనీసం ఒక రోజైనా పట్టేది. ప్రభుత్వ పథకాలూ ప్రజలకు చేరేవికావు.స్వరాష్ట్రంలో రోడ్ల నిర్మాణంతో జిల్లా ప్రగతి మార్గంలో పయనిస్తున్నది. రాళ్లు, గుట్టల రోడ్లలోనేడు రయ్య్మ్రంటూ దూసుకెళ్తున్నారు.
తిప్పన కోటిరెడ్డి (నమస్తే తెలంగాణ):రహదారుల నిర్మాణంతోనే అభివృద్ధి ముడిపడి ఉంటుందని బలంగా నమ్మిన సీఎం కే చంద్రశేఖర్రావు రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలోనే ఆ దిశగా అనేక చర్యలు చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా రహదారుల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా 129, 130,131 జీవోలను తీసుకువచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లా మొత్తానికి కలిపి వందకోట్లు కూడా వచ్చిన దాఖలాలు లేవు. కానీ, స్వరాష్ట్రంలో ఈ ఆరేండ్లలోనే ఒక్క ఆదిలాబాద్ జిల్లాకే దాదాపు రూ.400 కోట్లు విడుదల చేశారు. ఈ నిధులను పూర్తిగా సద్వినియోగం చేసుకున్న అధికారులు.. జిల్లా వ్యాప్తంగా రహదారుల నిర్మాణం చేపట్టారు. నేడు ఈ రహదారులను ఆధారం చేసుకొని అద్భుతమైన అభివృద్ధి జరుగుతున్నది. ప్రతి పల్లెకు, ప్రతి ఆదివాసిగూడేనికి సర్కారు ప్రవేశపెట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లాల్లో రహదారుల తీరును ‘నమస్తే తెలంగాణ’ పరిశీలించింది.
భారీగా నిధులు.. వేగంగా పనులు
రోడ్ల అభివృద్ధి కోసం రాష్ట్రప్రభుత్వం ప్రత్యేకంగా మూడు జీవోలు తీసుకువచ్చింది. దీనికితోడు రహదారులు-భవనాలశాఖను విస్తరించింది. ఆదిలాబాద్ను ప్రత్యేక డివిజన్గా, గతంలో సెక్షన్ కార్యాలయాలుగా ఉన్న ఉట్నూరు, బోథ్లను సడ్డివిజన్లుగా ఏర్పాటు చేసింది. ఒక్క ఆదిలాబాద్ జిల్లాకే రోడ్ల నిర్మాణం కోసం దాదాపు రూ.400 కోట్లు కేటాయించింది. జీవో 129 కింద రూ.178.34 కోట్లతో ఆదిలాబాద్-బేల, గుడి హత్నూర్- ఇంద్రవెల్లి, ఆదిలాబాద్ – సింకిడి- తలాయిగూడ -తలమడుగు- సింకిడి- తాంసీ, ఇచ్చోడ-సోనాల, హుస్నాపూర్- ఎల్లాపూర్, ఆదిలాబాద్-కెరమెరి రోడ్లు, జీవో 130 కింద రూ.64 కోట్లతో కాప్రి-నిరాల- బాలాపూర్, ఆదిలాబాద్-బోథ్, ఆదిలాబాద్ పట్టణంలో జీవో 131, కోర్ప్లాన్, అదర్ ప్లాన్ వర్క్స్ కింద ఆదిలాబాద్, బోధ్ ఖానాపూర్, ఆసిఫాబాద్ నియోజవర్గాల పరిధిలోని రోడ్లకు వాగులు, వంకలపై రూ.44.30 కోట్లతో బ్రిడ్జిల నిర్మాణంతోపాటు, రోడ్ల వ్యవస్థలను పటిష్ఠం చేసింది. ఎస్టీఎస్డీఎఫ్ నిధుల కింద రూ.10 కోట్లతో కొన్నిరోడ్లను, ఎస్ఆర్ ప్రోగ్రాం కింద రూ.61.90 కోట్లతో 18, డీఎమ్ఎఫ్టీ కిందరూ.8.70 కోట్లతో మరో 18 రోడ్లను అభివృద్ధి చేసింది. ఒక్క ఆదిలాబాద్ డివిజన్లోనే 45 బ్రిడ్జిలను నిర్మించారు.
మెత్తటి నేలల్లో పటిష్ఠంగా..
ఆదిలాబాద్ నేలలు బంకమన్నుతో జారుడునేలలు. ఏమాత్రం వర్షం వచ్చినా బురదమయం అవుతుంది. అధిక వర్షపాతంతో వాగులు వంకల్లో నీటివేగం ఎక్కువగా ఉంటుంది. ఆదిలాబాద్ రోడ్ల పరిస్థితిపై ఇంజినీరింగ్ నిపుణుడు, ఈఎన్సీ రవీందర్రావు ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఒకసారి రోడ్డువేస్తే దశాబ్దాల కాలం ఉండేలా ఇంజినీర్లకు దిశా నిర్దేశం చేశారు. దీంతో ఎగ్జికూటివ్ ఇంజినీర్లు రోడ్డు అడుగున గట్టి నేల తగిలే వరకు తవ్వి.. లూజు మట్టినంతా తరలించారు. నిర్మల్ ప్రాంతం నుంచి గట్టి మొరం తెప్పించి.. లెవల్కు వచ్చాక దానిపై కంకర వేశారు. తర్వాత మిక్సింగ్ వేసి.. ప్రమాణాల ప్రకారం బీటీ చేశారు. ఇలా పటిష్ఠంగా తయారైన రోడ్లు.. భారీ వర్షాలు వచ్చినా చెక్కు చెదరకుండా ఉన్నాయి.
ఎన్హెచ్లకు దీటుగా..
ఆదిలాబాద్ సమీపంలోని తాంసీ, తలమడుగు మండల కేంద్రాల వరకు ఉన్న రోడ్లు, ఆదిలాబాద్-బేల, ఆదిలాబాద్- కెరమెరి రోడ్లు అద్దంలా మెరుస్తున్నాయి. ఆదిలాబాద్- సుంకిడి- మహారాష్ట్ర సరిహద్దు గ్రామమైన యావత్మాల్ జిల్లా కిన్వర్ట్ తాలూకాకు చెందిన తలాయిగూడ వరకు రోడ్డు జాతీయరహదారులకు దీటుగా ఉన్నది. ఒకప్పటి రోడ్లకు, నేటి రోడ్లకు తేడా స్పష్టంగా తెలుస్తున్నదని స్థానికులు పేర్కొంటున్నారు. రోడ్లు వేశాకే తమ భూముల ధరలు పెరిగాయని, పండించిన పంటలను మంచి ధరకు అమ్ముకుంటున్నామని పేర్కొంటున్నారు. ఆదిలాబాద్కు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న మహరాష్ట్ర సరిహద్దును చూస్తే మన రోడ్లకు.. ఆ రాష్ట్ర రోడ్లకు ఉన్న తేడా ఇట్టే అర్థమవుతున్నది.
ఆదిలాబాద్ జిల్లాలో రహదారులు జాతీయ రహదారులకు ఏమాత్రం తీసిపోనివిగా ఉన్నాయి. గుట్టల మార్గంలోనూ ఎక్కడా ఎగుడు దిగుడుగా లేకుండా రోడ్లను నిర్మించారు. మహారాష్ట్ర సరిహద్దుకు చేరగానే వాహనం వేగాన్ని పూర్తిగా తగ్గించి అతి జాగ్రత్తగా వెళ్లాల్సిందే. ఆదిలాబాద్ జిల్లా నుంచి యావత్మాల్ వెళ్లే రహదారికి సుంకిడి వద్ద ఇరువైపులా రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న తాంసీ, తలమడుగు మండల కేంద్రాలకు రాష్ట్రప్రభుత్వం డబుల్ లేన్ రోడ్లను నిర్మించింది. గంతో ఈ రోడ్లు వ్యవసాయ భూముల వద్దకు వెళ్లే డొంకల్లాగా ఉండేవి.
ఒక ఎడ్లబండి వస్తే ఎదురుగా మరో బండి కూడా వెళ్లే అవకాశం లేకపోయేది. రాత్రిపూట ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి ద్విచక్రవాహనదారులు కిందపడి చనిపోయిన సంఘటనలు అనేకం జరిగాయి. వర్షాకాలం వస్తే మోకాలిలోతు బురదలో నుంచే వెళ్లాల్సి వచ్చేది. ప్రస్తుతం ఆదిలాబాద్కు 15 నిమిషాల్లో వెళుతున్నామని స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
మంచి రోడ్లు ప్రగతికి చిహ్నం
మంచిరోడ్లు ప్రగతికి చిహ్నమని ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తారు. సమైక్యపాలనలో రోడ్ల స్థితిగతులు అధ్వాన్నంగా ఉండేవి. నిధులన్నింటినీ ఆంధ్రకు తరలించుకు వెళ్లేవాళ్లు, తెలంగాణ ప్రాంత రోడ్ల అభివృద్థిపై తీవ్ర నిర్లక్ష్యం ఉండేది. స్వరాష్ట్రంలో ఆరేండ్లలోనే 60 ఏండ్లలో చేయని రోడ్ల పనులు చేశాం. ప్రతి మారుమూల పల్లె, తండాకు రోడ్లువేసి.. రోడ్ కనెక్టివిటీ ఇచ్చాం. మండల కేంద్రానికి డబుల్రోడ్ వేశాం. ప్రజలకు మంచి రోడ్లతో మెరుగైన రవాణా సౌకర్యం కల్పించగలుగుతున్నాం.
– వేముల ప్రశాంత్రెడ్డి, రోడ్లు, భవనాల శాఖ మంత్రి
ఇప్పుడు బాగుంది
గతంలో సుంకిడి నుంచి తాంసీకి చిన్న రోడ్డు ఉండేది. మలుపులు ఎక్కువ. ఎదురుగా మరో బండి వస్తే వెళ్లలేని పరిస్థితి. మూల మలుపు వద్ద ఎదురెదుగా వచ్చిన బండ్లను తప్పించబోయి ఇద్దరు చనిపోయారు. తెలంగాణ వచ్చాక రోడ్డును విస్తరించడంతోపాటు, డబుల్ లేన్ రోడ్ వేశారు. ఇప్పుడు చాలా బాగుంది.
– గుగిళ్ల పోశెట్టి, రైతు, తాంసీ
రోడ్డుపై వెళ్లాంటే భయమేసేది
ఇంతకు ముందు అటోతో రోడ్డు మీదకెళ్లాలంటే భయమేసేది. అన్ని గుంతలే. రోజుకు రెండు ట్రిప్పులు అతి కష్టమీద తోలేవాడిని. ఆటో నెలకోసారి రిపేర్ వచ్చేది. రోడ్డువేశాక 20 నిమిషాల్లో ఆదిలాబాద్ వెళ్తున్నా. ట్రిప్పులు ఎక్కువ పడుతున్నాయి. అటో మైలేజీ వస్తున్నది. ప్రతినెలా అదనంగా రూ.రెండు,మూడు వేలు మిగులుతున్నయి.
– అజారుద్దీన్, అటోడ్రైవర్, తలమడుగు
భూముల ధర అమాంతం పెరిగింది
తెలంగాణ వచ్చినంక బ్రిడ్జి నిర్మాణంతో ఇబ్బందులు తొలగిపోయాయి, ఇంతకు ముందు మా భూములు ఎకరం రూ. 3 లక్షలు కూడా పలుక లేదు. రోడ్డు వచ్చిన మూడేండ్లవుతున్నది. ఇప్పుడు ఎకరం భూమి రూ.10 లక్షల నుంచి రూ. 15 లక్షల వరకు పెరిగింది. ధర ఇస్తామన్న అమ్మేటోడు కూడా లేడు.
– ఖదరపు వెంకట్, రైతు, ఖరంజీ
అప్పుడు నిధులు వచ్చేది కాదు
ఉమ్మడిరాష్ట్రంలో అధికారులు తెలంగాణకు నిధులు ఇచ్చేవాళ్లు కాదు. ఆదిలాబాద్లోనే పనిచేసే సమయంలో రూ. 20 కోట్ల రోడ్లకు ప్రతిపాదనలు తీసుకువెళ్తే.. రాయలసీమకు చెందిన ఒక రోడ్డు కు రూ.17 కోట్లు, ఆంధ్రాకు చెందిన ఒకరోడ్డుకు రూ.23 కోట్లు ఇచ్చి, ఆదిలాబాద్ రోడ్డుకు కేవలం రూ.2 కోట్లు ఇచ్చారు. తెలంగాణ వచ్చినంక సీఎం కేసీఆర్ 129,130,131 జీవోల కింద దాదాపు రూ.400 కోట్ల వరకు ఇచ్చారు. రోడ్లు బాగు పడ్డాయి.
– నర్సయ్య, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, ఆదిలాబాద్ డివిజన్
ఇవీ కూడా చదవండి…
చిట్టి బుర్రల గట్టి ఆవిష్కరణలు