యాదాద్రి, మార్చి18 : మెడలో స్వర్ణ, వజ్ర, ముత్యాల ఆభరణాలు..చేతిలో సుమధుర గానామృతాన్ని పంచే పిల్లనగ్రోవి..ఒంటిపై పట్టుపీతాంబర వస్ర్తాలు..సుగంధ పరిమళ పుష్పాలతో అలంకరించిన దివ్య మంగళరూపంలో సకల జనావళిని సమ్మోహనం చేస్తూ యాదాద్రి పంచ నారసింహుడు శ్రీకృష్ణావతారం(మురళీకృష్ణుడు)గా దర్శనమిచ్చారు. విశ్వశాంతి, లోకకల్యాణం కోసం నిర్వహిస్తున్న నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగోరోజు గురువారం స్వామివారు ఉదయం పెండ్లికొడుకుగా ముస్తాబై శ్రీకృష్ణాలంకారంలో దర్శనమిచ్చారు. నిత్యపూజా కైంకర్యం అనంతరం మూలమంత్రం, మూర్తి మంత్రహోమాలు జరిపారు. ఉత్సవాల్లో భాగంగా హరిహరుడికి నవగ్రహ శాంతిమహోత్సవం ఘనంగా జరిగింది. సర్వాంగ సుందరంగా శ్రీమన్నారాయణుడి పూర్వఅవతారం వేణుగోపాల కృష్ణమూర్తి అలంకారంలో యాదాద్రీశుడిని తీర్చిదిద్దారు. అలంకారంలో వేద పురాణ, ఇతిహాస ప్రవచనాలను స్తుతిస్తూ పారాయణాయందారులు, యాజ్ఞికులు, రుత్వికులు, అర్చక బృందం స్తుతించారు. సంగీతం,సాహిత్యం, శాస్త్రం, వేదం, నాదం వంటి వైదృశ్యాలతో స్వామివారి మహోత్సవం, బాలాలయ మండపంలో స్వామివారి ఊరేగింపు సేవ అత్యంత కనులపండువగా సాగింది.
సాయంత్రం హంసవాహనంలో..
కొండపై కొలువైన దేవదేవుడు తన మనోనేత్రంలో లోకంలోని మంచి,చెడులను వేరు చేసే విధానికి ప్రతీకగా, పాలను, నీటిని వేరు చేయగల హంస దివ్యవాహనంగా స్వామివారు భక్తజనులకు గురువారం రాత్రి దర్శనమిచ్చారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగోరోజు రాత్రి నిత్యకైంకర్యాల అనంతరం నారసింహుడి దివ్యమైన అలంకారంతో హంస వాహనంపై అధిష్టింపజేసి బాలాలయ మండపంలో ఊరేగించారు. హంస వేదస్వరూపం, జ్ఞానాత్మకమైన వేద ప్రాముఖ్యంగా ఉన్న హంస వాహనసేవను ఆగమశాస్త్రరీతిన ప్రధానార్చకులు నిర్వహించారు.
హోమం, మహానివేదన
ఉత్సవాల్లో భాగంగా బాలాలయం యజ్ఞశాలలో హోమం నిర్వహించి, మహానివేదన గావించారు. రుత్వికులు శ్రీమద్భాగవత రామాయణాలు, పంచసూక్త పారాయణాలు చేశారు. వేదపండితులు చతుర్వేద పారాయణం చేసి లోకశాంతికి భగవంతుడి అనుగ్రహం కోసం వైదిక ప్రార్థన నిర్వహించారు. శ్రీకృష్ణాలంకార సేవలో కొలువైన స్వామివారిని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి దర్శించుకొని పూజలు నిర్వహించారు. ఆలయ ఈవో ఎన్.గీత, అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి, ఆలయ ప్రధానార్చకులు నల్లందీగల్ లక్ష్మీనారసింహాచార్యులు, మోహనాచార్యులు, యాజ్ఞీకులు శ్రీమాన్ ఉభయ వేదాంత శేషం ప్రణీతాచార్యులు, ఉప ప్రధానార్చకులు సురేంద్రాచార్యులు, రంగాచార్యులు, వెంకటాచార్యులు, శ్రీధరాచార్యులు, ఏఈవోలు శ్రవణ్కుమార్, రమేశ్బాబు తదితరులు పాల్గొన్నారు.