రెండు రకాలుగా పంట కొనుగోళ్లు
రైతులందరికీ గిట్టుబాటు కల్పిస్తాం
అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్
హైదరాబాద్, మార్చి 17 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వ చట్టాల ప్రకారం మార్కెట్లను తీసేసినా.. తెలంగాణలో మార్కెట్లను కొనసాగిస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామని, పంట కొనుగోళ్లు కొనసాగుతాయని సీఎం వెల్లడించారు. బుధవారం అసెంబ్లీలో మాట్లాడుతూ రైతుల విషయంలో నిబద్ధతతో వ్యవహరిస్తున్నామన్నారు. అసెంబ్లీలో సీఎం ప్రసంగం ఆయన మాటల్లోనే..
మార్కెట్ కేంద్రాలు యథాతథం
ఇప్పుడు మార్కెట్కు ధాన్యం రాబోతున్నది. మేం అలర్ట్గా ఉన్నాం. రాష్ట్రంలో 140 మార్కెట్లుంటే వాటిని దాదాపు 190 వరకు తీసుకెళ్లినం. నిన్న కూడా మా ఎమ్మెల్యేలు అడుగుతున్నరు. మాకు కొన్ని సబ్యార్డులు కావాలని. నేను ఒకటే మాట సభ ద్వారా స్పష్టంగా చెప్తున్నా. కేంద్ర ప్రభుత్వ చట్టాల ద్వారా ఒకవేళ వాళ్లు మార్కెట్లను తీసేసినా, ఈ రాష్ట్రంలో మార్కెట్లను కొనసాగిస్తాం. మార్కెట్లోకి పోతే కొంటరు. ఆ మార్కెట్ కమిటీ వేదికగా అమ్మకాలు, కొనుగోళ్లు జరుగుతాయి. గతేడాది మన దగ్గర భిన్నమైన పరిస్థితులు ఉండే. గద్వాల జిల్లాలో పండిన మొత్తం పంట రాయచూర్కి వెళ్లిపోతది.. మన దగ్గరికి రాదు. నిజామాబాద్లో నిజాంసాగర్ కింద పండే పంటలు 90% కర్ణాటక వాళ్లు తీసుకెళ్తరు. ప్రతి సీజన్లో మేలురకమైన సన్నాలు పండిస్తరు కాబట్టి దాదాపు ఏడు, ఎనిమిది వందల లారీల ధాన్యం కర్ణాటకకు పోతున్నది. ఇలా మార్కెట్ అనేది రకరకాలుగా ఉంటది. రైతుకు ఎక్కడ గిట్టుబాటు అయితే అక్కడ అమ్ముతరు.
మన మిర్యాలగూడ, హుజూర్నగర్, కోదాడ లాంటి ప్రాంతాల్లో నాగార్జునసాగర్ ఆయకట్టు కింద పండే పంట మార్కెట్లకు తేరు. మిల్లర్లు రైతులకు మధ్య ఒప్పందం ఉంటది. వాళ్లు పంట తీసుకొని డైరెక్ట్గా మిల్లులకే పోతరు. మన ఎమ్మెల్యే భాస్కరరావు, మిర్యాలగూడలో 70 ఎకరాల నాటు వేస్తరు. ఆయనకు నేను అడిగిన.. భాస్కర్రావు మీరెలా అమ్ముతరంటే సార్ మేం ఎండబోయడం, తాలు తీసేయడం, పోలు తీసేయడం మాకు టైం పడుతుంది. ధాన్యం రాగానే మరో పంట వేసుకోవాలే కాబట్టి సన్న వడ్లు తీసుకెళ్లి రూ.1400 అమ్ముతం అని చెప్పారు. తక్కువ ధర కదా అంటే మేం మొత్తం ఎండబెట్టి, అంతా చేసేసరికి ఆడికే వస్తది సర్. మాకు అదే లాభసాటి అని చెప్పారు. రకరకాల రూపాల్లో ధాన్యం ఉత్పత్తి, కొనుగోళ్లు మన రాష్ట్రంలో ఉన్నది. వ్యవసాయశాఖ, సివిల్ సప్లయ్ మంత్రి ఎప్పటికప్పుడు ఎఫ్సీఐతో చర్చలు జరుపుతున్నరు. ఈ ఏడాది కూడా 80 లక్షల టన్నుల ధాన్యం తీసుకుంటమని ఎఫ్సీఐ వాళ్లు హామీ ఇచ్చారు. రూ.1888 గిట్టుబాటు ధర ఇస్తామని చెప్పారు. మేం గవర్నమెంట్ తరఫున పౌరసరఫరాల కార్పొరేషన్కు అవసరమైతే రూ.30 లేదా రూ.40 కోట్ల గ్యారంటీ ఇస్తాం.
పైరవీకారు లేడు.. బ్రోకర్ లేడు..
రైతుబంధు చెక్కులపై చాలామంది పైరవీ కారులకు బాధ ఉన్నది. మేం రైతుబంధు కింద ఇచ్చేది రూ.15 వేల కోట్లు. ఇక్కడ పైనాన్స్ డిపార్ట్మెంట్ డబ్బులు వేస్తే టంగ్మని అక్కడ రైతుల సెల్ఫోన్లో మెసేజ్ వస్తది. పైరవీకారు లేడు, బ్రోకర్ లేడు. దరఖాస్తు లేదు, దస్తరు లేదు. ఒకసారి ప్రభుత్వంలో ఎన్లిస్ట్ అయితే నేరుగా వారి ఖాతాల్లోకి వెళ్లి డబ్బులు పడిపోతున్నాయి. ధాన్యం కొనుగోళ్లలో కూడా భట్టివిక్రమార్క పార్టీవారు గతంలో చేయలేదు.. మేం చేసినం. ఈ రోజు కొంటే ఎల్లుండి చెక్కుపోతది. ఇప్పుడు కూడా ఎంఎస్పీ ప్రకారంగా ధాన్యాన్ని కొంటాం. డబ్బులు ఇస్తాం. రైతులకు గిట్టుబాటు కల్పిస్తాం. మాకు ఆ కమిట్మెంట్ ఉంది.
త్వరలో భారీ గోదాముల నిర్మాణం
మరో పదిహేను, ఇరవై రోజుల్లో మొదలై నెలన్నర, రెండు నెలల పాటు పంటలు వస్తయి. నియంత్రిత విధానంలో వ్యవసాయశాఖ ద్వారా కూపన్లు ఇప్పించి కొంత మార్కెట్లకు తెమ్మని చెప్తాం. అక్కడ ఎఫ్సీఐ కొనుగోలు కేంద్రాలు ఉంటాయి. అక్కడ కొంటాం. కరోనా బాధలుండే ప్రాంతాలు, మారుమూల గ్రామాల్లో ఎంతవరకు కొనుగోలు కేంద్రాలు పెట్టగలుగుతమో ఆలోచిస్తాం. రైతులెవరూ దిగులుపడాల్సిన అవసరం లేదు. ధాన్యాన్ని మొత్తం బాజాప్తాగా ఎమ్మెస్పీకి కొనిపిస్తాం. రాబోయే రోజుల్లో మార్కెట్ కమిటీలే వేదికలు కావాలె. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చే నాటికి ఇక్కడ నాలుగు లక్షల టన్నుల గోడౌన్ల సామర్థ్యం ఉండేది. దాన్ని 24 లక్షలకు తీసుకెళ్లినం. మళ్లీ రివ్యూచేస్తే అర్జెంట్గా 40 లక్షల సామర్థ్యం గల గోడౌన్లు కట్టాలని చెప్తున్నారు. కలెక్టర్లకు ఆదేశాలిచ్చాం త్వరలోనే వాటి నిర్మాణానికి శ్రీకారం చుడతాం.
హేళన చేసిన రాష్ట్రంకంటే ఎక్కువ సాగు చేస్తున్నాం
2014లో రాష్ట్రంలో వరి సాగు చేసింది 12.23 లక్షల ఎకరాలే. ఈ రోజు యాసంగి సాగులో తెలంగాణ దేశంలోనే నం.1 గా నిలిచింది. ఈ రోజు 52.28 లక్షల ఎకరాల్లో వరినాట్లు వేసిండ్రు.. ఎక్కడి 12 లక్షలు? ఎక్కడి 52 లక్షల ఎకరాలు? ఇది చెప్పరు భట్టి విక్రమార్క. ఏ ఉమ్మడి పాలకులు ఆనాడు మనల్ని పరిహాసం చేసిండ్రో.. మీకు వ్యవసాయం చేయరాదని హేళనతో మాట్లాడిండ్రో.. ఆ రాష్ట్రంలో ఈ రోజు 20 లక్షల ఎకరాలే వరి సాగైంది. ఆ రాష్ట్రం కన్నా దాదాపు రెండున్నర రెట్లు ఎక్కువగా వరినాట్లు మన దగ్గర పడ్డాయి. ఆ విధంగా నేను ప్రోత్సహించిన. ఇదంతా ఉట్టిమాటలతో సాధ్యంకాలేదు. చాలా కష్టపడ్డాం. వ్యవసాయాన్ని ప్రోత్సహించినం. వారి కాలంలో నీరు పారినా, పారకున్నా నీటి తీరువా దంచి మరీ వసూలు చేసిండ్రు. మేమొచ్చేనాటికి నీటి తీరువా రూ.కోటి బకాయిలు ఉండే. మొత్తం బకాయిలు ఎత్తేసినం.
సబ్సిడీలను పెంచినం
మా కన్నా ముందు ఈ రాష్ట్రంలో 128 ఎకరాల్లోనే పాలిహౌజ్లు ఉంటే మా సమయంలో దాన్ని 1,325 ఎకరాలకు పెంచినం. అప్పుడు వాళ్లు 50% సబ్సిడీ ఇచ్చారు. కానీ మేము 75 నుంచి 100 % సబ్సిడీ ఇస్తున్నాం. ఒకే ఎకరానికి అని ఆనాడు పరిమితి పెడితే.. మేం మూడెకరాలకు పెంచాం. 6,72,700 ఎకరాలకు డ్రిప్, స్ప్రింక్లర్లు ఇచ్చినం. వారు 50% సబ్సిడీ ఇస్తే మేము ఎస్సీ, ఎస్టీలకు 100%, ఇతరులకు 80% సబ్సిడీ ఇచ్చాం. వారికి మాకు ఎక్కడా పోలిక ఉండదు. వారి కాలంలోనే ఉన్నట్లుగా మా కాలంలోనూ ఉన్నదని వారు అనుకుంటున్నారు. వారు ఆ భ్రమల నుంచి బ యటకు రావాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నా. అన్ని రంగాల్లోనూ గుణాత్మక మార్పులు తీసుకొచ్చాం.
పంట కొనుగోళ్లు ఉంటాయి
రాష్ట్రంలో పంట విస్తీర్ణం, దిగుబడి భారీగా పెరిగింది. ఇప్పటికే మేం రూ.ఏడున్నర వేల కోట్ల మేర ధాన్యం కొన్నాం, రైతులకు డబ్బులు ఇచ్చేసినం. తరువాత కొంతనష్టం వస్తది. ఎందుకంటే ఎఫ్సీఐ వారికి ఇస్తాం. ఎఫ్సీఐ వాళ్లు తిరిగి మన సివిల్ సప్లయ్ కార్పొరేషన్కు డబ్బులివ్వడానికి 4 నెలలు పడుతుంది. మేం బ్యాంకు గ్యారంటీ ఇచ్చి లోన్ తీసుకొని ఇస్తాం. ఈ 4 నెలలకు వడ్డీ కట్టాలి. ఏటా వెయ్యి, 1,500, 2వేల కోట్లు భారం పడుతుంది. ఈ పంటకు కూడా అదే పద్ధతి కొనసాగిస్తాం. ఎఫ్సీఐతో చర్చిస్తున్నాం. ఎటుపడితే అటు రావడం రైతులకూ మంచిది కాదు. నాకు కూడా పొలం ఉన్నది. నాది, నా కొడుకుది కలిపితే దాదాపు 70 నుంచి 80 ఎకరాలు. నికార్సైన పంట పండించి, మంచిగ తాలు, పొల్లు లేకుండా, ఎండబోసి ఇచ్చే ధాన్యానికి మద్దతుధర అడగాలి. మనం నికార్సైన పంట తీసుకొని పోవాలె. బాజాప్తా 1880 ఎమ్మెస్పీ పొందాలె.