ధర్మపురి, మార్చి 14: తమ కూతురి పుట్టిన రోజు సందర్భంగా ఓ ఎన్నారై దంపతులు నిరుపేదకు అండగా నిలిచారు. జగిత్యాలకు చెందిన ఎన్నారై దంపతులు ఎలగందుల స్వరాజ్-అశ్విని తమ కూతు రు శ్రీమయి పుట్టినరోజు సందర్భంగా ఫిబ్రవరి 6న ఓ పేద కుటుంబానికి ఇంటిని నిర్మించివ్వాలని నిర్ణయించుకున్నారు. వెంటనే ధర్మపురికి చెందిన సామాజిక సేవకుడు రేణికుంట రమేశ్ను సంప్రదించగా, అతను స్థానికురాలు బెల్గం లావణ్య దీనస్థితిని వివరించారు. లావణ్య భర్త అనారోగ్యంతో మృతి చెందగా ఆమె కూలీ పనిచేస్తూ బంధువుల ఇళ్లలో తలదాచుకుంటున్నది. వెంటనే స్పందించిన ఎన్నారై దంపతులు.. లావణ్యకు ఉన్న కొద్ది స్థలంలో గత నెలలో రూ.1.97 లక్షలతో ఇంటి నిర్మాణ పనులను ప్రారంభించి, పూర్తి చేశారు. ఆదివారం స్వరాజ్ తల్లిదండ్రులు ఎలగందుల సుధాకర్-పద్మ నూతన గృహాన్ని ప్రారంభించి లావణ్యకు అప్పగించారు. ఈ సందర్భంగా ఎన్నారై దంపతులు, వారి తల్లిదండ్రులకు లావణ్య ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది.